సిడ్నీ: ఆస్ట్రేలియా-ఎ తో శుక్రవారం ప్రారంభమైన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో ప్రధాన బ్యాట్స్మెన్ విఫలమైన చోట జస్ప్రీత్ బుమ్రా చెలరేగాడు. 55 (57 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్) పరుగులతో నాటౌట్గా నిలిచి ఆకట్టుకున్నాడు. ఇదిలాఉండగా.. బుమ్రా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో బౌలర్ కామెరూన్ గ్రీన్ గాయపడ్డాడు. కామెరూన్ విసిరిన బంతిని బుమ్రా స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. అయితే, ఆ షాట్ బాల్ నేరుగా గ్రీన్ తలకు బలంగా తాకింది. దీంతో నొప్పితో విలవిల్లాడిన గ్రీన్ పిచ్లోనే కూలబడ్డాడు.
దీంతో నాన్స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న మహ్మద్ సిరాజ్ తన బ్యాట్ను పడేసి పరుగు పూర్తి చేయకుండానే కామెరూన్ వద్దకు పరిగెత్తాడు. అంపైర్ వెంటనే ఫిజియోను రప్పించడంతో మైదానంలో కాసేపు ఉత్కంఠ నెలకొంది. గ్రీన్ గాయం పరిస్థితి ఎలా ఉందనే సమాచారమైతే లేదు. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే అతను తొలి టెస్టు ఆడడం అనుమానమే. ఇప్పటికే ఓపెనర్ డేవిడ్ వార్నర్ తొలి టెస్టుకు దూరం కావడం.. మరో ఆటగాడు విన్ పుకోవిస్కి త్యాగి బౌన్సర్కు గాయపడడం.. తాజాగా గ్రీన్కు దెబ్బ తగలడంతో ఆసీస్ మేనేజ్మెంట్ ఆందోళనలో ఉంది.
కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్-ఎ ఇన్నింగ్స్ను పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ ఆరంభించారు. ఆదిలోనే మయాంక్ వికెట్ కోల్పోగా, పృథ్వీ షా(40) రాణించాడు. అనంతరం శుబ్మన్ గిల్(43) కూడా మెరిశాడు. ఆపై వరుసగా ఆరుగురు ఆటగాళ్లు విఫలమైనా, బుమ్రా మాత్రం ఆత్మ విశ్వాసంతో ఆడాడు. సిరాజ్ (22)తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఈ జోడి 71 పరుగులు జత చేసి ఇన్నింగ్స్ను గాడిలో పెట్టారు. ఈ క్రమంలోనే బుమ్రా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. సదర్లాండ్ బౌలింగ్ సిక్స్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది బుమ్రాకు తొలి ఫస్ట్క్లాస్ సెంచరీ కావడం విశేషం. బుమ్రా అర్థ సెంచరీ సాధించిన కాసేపటికి సిరాజ్ పదో వికెట్గా ఔట్ కావడంతో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. భారత్-ఎ 194 పరుగులకు ఆలౌట్ కాగా, ఆసీస్-ఎ జట్టు 108 పరుగులు మాత్రమే చేసి ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో భారత్-ఎ 86 పరుగుల ఆదిక్యంలో నిలిచింది.