బాలీవుడ్లో తనుశ్రీ దత్తా చేపట్టిన ‘మీటూ’ ఉద్యమం.. సినీ రంగం నుంచి క్రీడా రంగం వైపునకు పయనిస్తోంది. మహిళలపై వేధింపుల ఘటనలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఇదే దేశమంతా ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో బాధిత మహిళలకు మద్దతు పెరిగిపోతుండగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తీవ్ర విమర్శల పాలవుతున్నారు.
శ్రీలంక క్రికెట్ దిగ్గజం మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ ఎయిర్హోస్టెస్ సంచలన ఆరోపణలు కలకలం రేపిన మరుసటిరోజే మరో లంక క్రికెటర్ పేరు వెలుగుచూసింది. లసిత్ మలింగ లైంగిక వేధింపులకు సంబంధించి స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.తన పేరు చెప్పకుండా మలింగా గురించి వివరాలు బయటపెట్టమని కోరిందట. దీంతో విషయాన్ని మాత్రమే స్క్రీన్ షాట్ తీసిన చిన్మయి ట్విటర్లో పోస్ట్ చేసింది.
నా వివరాలు వెల్లడించాలనుకోవట్లేదు. కొన్నేళ్ల క్రితం నేను ముంబయిలో ఉన్నప్పుడు ఒక రోజు నా స్నేహితురాలి కోసం హోటల్లో ఎదురుచూస్తున్నాను. ఐపీఎల్ మ్యాచ్ నిమిత్తం మలింగా అదే హోటల్కు వచ్చాడు. మలింగా నా వద్దకు వచ్చి ‘నీ స్నేహితురాలు గదిలోనే ఉన్నారు’ అన్నాడు. నేను వెళ్లి చూశాను. కానీ గదిలో ఆమె లేదు. ఆ సమయంలో మలింగ వెనక నుంచి వచ్చి నన్ను మంచంపైకి తోసేశాడు. అతని నుంచి విడిపించుకోలేకపోయాను. నా అరుపులు విని హోటల్ సిబ్బంది వచ్చి డోర్ కొట్టారు. అప్పుడు మలింగ నన్ను వదిలేసి డోర్ తీయడానికి వెళ్లాడు. నేను వెంటనే ముఖం కడుక్కుని అక్కడి నుంచి వెళ్లిపోయాను. చాలా అవమానపడ్డాను. ఈ విషయాన్ని నాకు తెలిసినవారికి చెబితే ‘నువ్వు కావాలనే మలింగ గదిలోకి వెళ్లావు. అతని వల్ల నీకు పాపులారిటీ వస్తుందనే అలా చేశావు’ అన్నార’’ అని సదరు బాధితురాలు వెల్లడించారు.పేరు బహిర్గతం చేయవద్దని కోరినందుకు బాధితురాలి పేరు చెప్పడం లేదని చిన్మయి మరో ట్వీట్ చేశారు.