సచిన్ టెండూల్కర్. ఈ పేరు వింటే దేశం మొత్తం కదిలిపోతుంది. ఏ టీవి అయినా.. సోషల్ మీడియా అయినా ఆ పేరు మీద గంటల కొద్దీ ప్రచారాన్ని నిర్వహించేవి. అయితే ఇప్పుడు సీన్ మారింది. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ పేరు వింటే సామాజిక మాధ్యమాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఎందుకంటారా. ఏం లేదు. వెస్ట్ జోన్ అండర్ 16 జట్టులో అర్జున్ కు స్ధానం దక్కడమే దీనికి కారణం.
అతని ఎంపిక కంటే కూడా ఎంతో ప్రతిభ ఉన్న మరో ఆటగాడు ప్రణవ్ ధనవాడేను ఈ జట్టు కోసం ఎంపిక చేయకపోవడమే ప్రధాన కారణంగా చూపిస్తున్నారు. గత సీజన్ లో ఈ 15 ఏళ్ల ప్రణవ్ 327 బంతుల్లో 1009 పరుగులు చేసి అందరిని ఆకర్షించాడు. దీంతో ప్రణవ్ పేరు దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఎంతో ప్రతిభ ఉన్న ప్రణవ్ ను కాదని అర్జున్ ఎంపిక చేయడం వెనుక కుట్ర ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో అందరూ మండిపడుతున్నారు.
ప్రణవ్ ఓ ఆటో డ్రైవర్ కొడుకు కాబట్టే అతడ్ని ఎంపిక చేయలేదని, అర్జున్ అయితే సచిన్ టెండూల్కర్ కుమారుడని ఎంపిక చేశారంటూ దుమ్మెత్తుతున్నారు. దీనిపై ప్రణవ్ ధనవాడే తండ్రి ప్రశాంత్ ధనవాడే స్పందించాడు. తన కుమారుడికి ఎలాంటి అన్యాయం జరగలేదని, ఎంసిఎ అండర్ 16 టీం తరఫున ఆడకపోవడం వల్లే తన కుమారుడ్ని ఎంపిక చేయలేదని అన్నాడు. ప్రణవ్ వెయ్యి పరుగుల ఇన్నింగ్స్ ఆడక ముందే ఈ ఎంపిక జరిగిపోయిందని అతను పేర్కొన్నాడు. ప్రస్తుతం ప్రణవ్ అండర్ 19 జట్టులో ఎంపిక కావడంపైనే శ్రద్ధగా ఉన్నాడని, మిగిలిన అంశాలపై అతనికి ఆసక్తి లేదని తెలిపాడు.