ఎంతో ప్రతిభ ఉన్నా హైదరాబాద్ ఆటగాడు అంబటి రాయుడిని ప్రపంచకప్లో ఆడే భారత జట్టులోకి ఎంపికచేయలేదు. రాయుడిని ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐమీద విమర్శలు రావడంతో అతన్ని స్టాండ్బై ఆటగాడిగా తీసుకున్నారు. అదృష్టం ఉంటె ఎలాంటి అవకాశమైనా వెత్తుక్కుంటూ వస్తుంది. ఇప్పుడు కేదార్ జాదవ్ రూపంలో రాయుడికి ప్రపంచకప్లో ఆడే అదృష్టం కలసి వచ్చింది.
వరల్డ్ కప్కు ఎంపికైన కేదార్ జాదవ్ ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నై తరుపున ఆడుతున్నారు. ఆదివారం కింగ్స్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో బౌండరీని ఆపబోయి జాదవ్ గాయపడ్డాడు.అతడి గాయం తీవ్రత దృష్ట్యా ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్ లకు పక్కనబెట్టాలని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం నిర్ణయించింది. ఎక్స్-రే టెస్టులో గాయం బలమైనదే అని తెలుస్తున్నా, మరోసారి పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్టు సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపారు.
దీంతో ప్రపంచకప్లో ఆడటం కూడా అనుమానంగా కనిపిస్తోంది.ఈ నెల 30వ తేదీ నుంచి ఇంగ్లండ్ వేదిక వరల్డ్కప్ ఆరంభం కానుండగా, జాదవ్ ముందుగానే ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంది. ఒకవేళ ఇంగ్లిష్ గడ్డపై భారత జట్టు అడుగుపెట్టే సమయానికి జాదవ్ ఫిట్నెస్ను నిరూపించుకోలేకపోతే ఆ మెగాటోర్నీలో ఆడటం కష్టమే.
టీమిండియా మేనేజ్మెంట్ కానీ, సెలక్టర్లు కానీ జాదవ్ గాయం అంత సీరియస్ కాదని పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్పప్పటికీ, లోపల మాత్రం అతని గాయంపై మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.భారత క్రికెట్ జట్టు మే 22వ తేదీన ఇంగ్లండ్కు పయనం కానున్న తరుణంలో ముందుగానే అతనికి ప్రత్యామ్నాయంగా ఎవర్ని పంపాలనే విషయంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ జాదవ్ అందుబాటులోకి రాకపోతే స్టాంబ్ బైలో ఉన్న అంబటి రాయుడ్ని కానీ యువ సంచలనం రిషభ్ పంత్ను కానీ ఇంగ్లండ్కు పంపే అవకాశం ఉంది.
ఇప్పటికే జట్టులో ధోనీ, దినేశ్ కార్తీక్ రూపంలో ఇప్పటికే ఇద్దరు వికెట్ కీపర్లు ఉన్నారు. ఇప్పుడు రాయుడు, పంత్ కూడా ఇద్దరూ వికెట్ కీపర్లే అయినా రాయుడికి అన్యాయం జరిగిందన్న భావన అటు మాజీ క్రికెటర్లు, కొందరు సెలక్టర్లలో కనిపిస్తోంది. పంత్కు భవిష్యత్తులో చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి రాయుడికే అవకాశం ఇవ్వాలని అన్ని వైపులనుంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.