ఆదివారం ముంబయి ఇండియన్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠకు దారితీసింది. క్రికెట్ చరిత్రలో ఒక మ్యాచ్లో రెండు సూపర్ ఓవర్లతో ఫలితం తేలింది. ఎలాగైనా గెలవాలన్న కసితో ఆడిన పంజాబ్.. ముంబయికి షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ముంబయితో మ్యాచ్లో పోరాట స్ఫూర్తిని కనబర్చిన పంజాబ్ ఈసారి ఫైనల్కు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఈ మ్యాచ్లో తొలుత జరిగిన సూపర్ ఓవర్లో బుమ్రా రెండు వికెట్లు తీసి పంజాబ్ను అయిదు పరుగులకే కట్టడి చేశాడు. అనంతరం షమీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం వల్ల ముంబయి సరిగ్గా అయిదు పరుగులే చేసింది. ఆఖరి బంతికి డికాక్ రెండో పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు.
అనంతరం మరో సూపర్ ఓవర్లో.. తొలుత బ్యాటింగ్కు దిగిన ముంబయి.. వికెట్ కోల్పోయి 11 పరుగులు చేసింది. తర్వాత బరిలోకి దిగిన గేల్, మయాంక్ లక్ష్యాన్ని మరో రెండు బంతులుండగానే ఛేదించి జట్టును విజయతీరాలకు చేర్చారు.