ఫేస్ బుక్ లో తనకు పరిచయమైన అమ్మాయిపై అత్యాచారానికి ప్రయత్నించిన సంఘటన కృష్ణాజిల్లాలో కలకలం రేపింది. ఫేస్ బుక్ లో పరిచయమైన బీటెక్ విద్యార్థినిని ఉద్యోగం పేరుతో నమ్మించి లాడ్జీలోకి తీసుకెళ్లి తన స్నేహితులతో అత్యాచారానికి ప్రయత్నించి దాన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.
మైలవరంలో ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న అమ్మాయికి ఇబ్రహీం పట్నంకు చెందిన మణికంఠ అనే యువకుడితో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. మణికంఠ ఆ యువతికి ఉద్యోగం ఉందని తనను కలవాలంటూ మెసేజ్ చేసినట్లు తెలిసింది. కలిసేందుకు ఆ యువతి అంగీకారం తెలపడంతో మణికంఠ ఆ అమ్మాయిని ఈనెల 11న కేవీఆర్ గ్రాండ్ హోటల్ లో రూమ్ బుక్ చేసుకుని కారులో తీసుకెళ్లాడు.
వారిద్దరూ గదిలో ఉన్న సమయంలో అతని మరో ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు. ముగ్గురూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, ఆ దృశ్యాలను మొబైల్ ఫోన్లలో షూట్ చేశారు.అయితే బీటెక్ స్టూడెంట్ వారి బారినుంచి తప్పించుకుని బయటపడింది. అయితే సెల్ ఫోన్లో చిత్రీకరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనలో తనపై రేప్, జరగలేదని, మణికంఠ అనే స్నేహితుడితో లాడ్జికి వెళ్లానని, అక్కడ తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తే పారిపోయానని ఆమె ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. నిందితులపై అత్యాచారయత్నం అభియోగాలను మోపిన పోలీసులు కేసు దర్యాఫ్తు చేస్తున్నారు.