జనసేనలో నేతలు ఒకరి తరువాత మరొకరు పార్టీ వీడుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎప్పటికీ పట్టు నిలిచిపోతుందని భావించిన జనసేనానికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. జనసేన నుండి కొందరు నేతలు బీజేపీ బాట పట్టగా..ఇప్పుడు మరో ముఖ్య నేత పార్టీకి గుడ్ బై చెప్పారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన ఆ పార్టీ సీనీయర్ నేత ఆకుల సత్యనారాయణ పార్టీని వీడారు. 2014లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలు పొందిన సత్యనారాయణ సార్వత్రిక ఎన్నికల ముందు ఆ పార్టీని వీడి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. దీంతో రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి పోటీచేసే అవకాశం పార్టీ ఇచ్చింది. జనసేనాని ఆధ్వర్యంలో అదృష్టం పరీక్షించుకున్నా ఓటమిపాలయ్యారు.
ఎన్నికల్లో జనసేన ఓటమి తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం అరుదుగా జరిగింది. విజయవాడలో జరిగిన పార్టీ సమావేశాలకు హాజరుకాలేదు.ఇప్పుడు అధికార వైసీపీలో చేరేందుకు ముహూర్తం సిద్ధం చేసుకున్నారని సమాచారం. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీలో చేరేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది.
వైసీపీలో చేరికకు ముఖ్యమంత్రి జగన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాపు నేతలను ఆకర్షించే ప్రయత్నాల్లో ఉన్న వైసీపీ ఇప్పుడు ఆకులను పార్టీలో చేర్చుకుంటోంది.రావెల కిషోర్ బాబుతో పాటుగాను పార్టీ వీడాలని భావించినా.. కొంత కాలం వేచి చూసే ధోరణితో వ్యవహరించారు. ఇప్పుడు ఆయన పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు. వైసీపీ నుండి వచ్చిన ఆహ్వానం మేరకు ఆయన పండుగ నాడు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని నిర్ణయించారు.