అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘం (పీఆర్టీయూ) సభ్యుల ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అంతేకాదు,మిగతా పీఆర్టీయూ ఎమ్మెల్సీలతోనూ రాజీనామా చేయించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. తనకు పీఆర్టీయూనే ముఖ్యమని.. టీఆర్ఎస్ కాదని పూల రవీందర్ స్పష్టం చేశారు. రాష్ట్ర సాధన కోసం ఉపాధ్యాయులు ఎంతో కృషి చేశారన్నారు ప్రభుత్వం వెంటనే 45శాతం పీఆర్సీని,హెచ్ఆర్ఏ తగ్గించకుండా ప్రకటించాలని, సీపీఎస్ విధానం పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
మంగళవారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ వద్ద చేపట్టిన పీఆర్టీయూ మహాధర్నాలో పూల రవీందర్ మాట్లాడారు.దాదాపు 31 ఒక్క నెలలపాటు కాలయాపన చేసిన పీఆర్సీ కమిటీ.. ఉపాధ్యాయ, ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లే నివేదిక ఇచ్చిందని రవీందర్ విమర్శించారు. ‘మనకు టీఆర్ఎస్ పార్టీ ముఖ్యం కాదు, పీఆర్టీయూ ముఖ్యం. పీఆర్టీయూ తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారానికి త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించేందుకు కార్యాచరణ రూపొందిస్తాం.’ అని ప్రకటించారు.
ఇటీవల బిస్వాల్ కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ప్రభుత్వ ఉద్యోగులకు కేవలం 7శాతం ఫిట్మెంట్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిట్మెంట్ను 45శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు నిరసన బాట పట్టారు. ఈ క్రమంలోనే మంగళవారం అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
కాగా, 2019లో జరిగిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. టీఆర్ఎస్ మద్దతుతో పీఆర్టీయూ అభ్యర్థిగా పూల రవీందర్ బరిలోకి దిగారు. ఆయనపై యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి విజయం సాధించారు.అంతకు ముందు ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార పార్టీ అభ్యర్థి వరదారెడ్డిపై విజయం సాధించిన పూల రవీందర్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
Also Read
మేలో సాయి తేజ్ పెళ్లి.. అమ్మాయి ఎవ్వరంటే..?
తెలంగాణలో షర్మిల పార్టీ.. ప్రభావం ఎంత?!