ముగ్గురు స్నేహితులు సరదాగా ఒకే బైక్పై అడవిలోకి షికారుకు వెళ్లారు. అక్కడ పులులుంటాయని అటవీ అధికారులు హెచ్చరించినా వాళ్ల చెవికి ఎక్కలేదు. అడవిని చూద్దామన్న కుతూహలం వాళ్ల కొంప ముంచింది. ముగ్గురు యువకుల్లో ఇద్దరిని పులి చంపేసింది. మూడో వాడు చెట్టెక్కి 8 గంటలపాటు టెన్షన్ టెన్షన్గా గడిపాడు. ఓ క్రైం స్టోరీలోనో, థ్రిల్లర్ సినిమాలోనో జరిగిన ఘటన కాదిది. వాస్తవమే సంఘటన.
తన కళ్లముందే స్నేహితులను పులి చంపుతుంటే .. నిస్సహాయ స్థితిలో ఓ యవకుడు ఎనిమిది గంటల పాటు నిద్రలేకుండా చెట్టుమీద గడిపాడంటే.. అతడి పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నదో ఊహించుకోవచ్చు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఫిలిబిట్ ప్రాంతంలోని ఖర్నౌట్ నదీ పరివాహ ప్రాంతంలో అటవీ పరిసరాల్లో ఈ ఘటన చోటుచేసుకున్నది. ఈ ఘటనలో బతికి బయటకొచ్చిన కుర్రాడి పేరు వికాస్. అతడు ఏమంటున్నాడంటే..
‘నా ఫ్రెండ్స్ సోను, కాందైలాల్తో అడవికి వెళ్లాలనుకున్నాం. అడవి లోపలికి వెళ్లి చూడాలన్నది మా కోరిక. అక్కడ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాకు కుతూహలం ఉండేది.నా ఫ్రెండ్ సోను బైక్ నడుపుతున్నాడు. ఇక కాందైలాల్ మధ్యలో కూర్చొన్నాడు. నేను వెనకాల కూర్చొన్నాను. కొందరు అటవీ అధికారులు అడవిలో భయంకరమైన పులులు ఉన్నాయని చెప్పారు. కానీ మేం వినలేదు.
అయితే మేం అడవి లోపలికి ఓ సన్నదారి గుండా వెళ్తున్నాం. కొంత దూరం వెళ్లగానే మాకు రెండు పులులు కనిపించాయి. వాటినుంచి తప్పించుకోవడానికి బైక్ నడుపుతున్న సోను ఎంతో ప్రయత్నించాడు. కానీ పులులు బైక్ను వెంబడించాయి. ముందుగా పులి నా ఫ్రెండ్ సోను మీద దాడి చేసింది. ఆ తర్వాత నేను, కాందలాల్ చెట్టు ఎక్కాలని ట్రై చేశాం. నేను వేగంగా వెళ్లి చెట్టు ఎక్కాను. అప్పుడు సరిగ్గా రాత్రి ఎనిమిది గంటలు అవుతోంది. చీకటి కమ్ముకున్నది.
ఇక ఆ పులులు నా ఫ్రెండ్స్ను తినేశాయి. నేను చెట్టుమీద నుంచి ఆ దృశ్యాలను చూశాను. నేను రాత్రంతా చెట్టుమీదే బిక్కు బిక్కు మంటూ గడిపాను.పులులు చెట్టేందుకు యత్నించాయి. కానీ కొద్దిసేపటికి అవి వెళ్లిపోయాయి’ అంటూ చెప్పుకొచ్చాడు వికాస్.