ఏపీ ఐటీ మంత్రి లోకేష్గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంత పాపులారిటీ సంపాదించారు. ఏదో విధంగా చినబాబును రాజకీయాల్లోకి తీసుకురావడానికి బాబు పడిన కష్టం అంతా ఇంతా కాదు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేడని తెలిసి దొడ్డిదారిని గవర్న్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యి ఇప్పుడు ప్రభుత్వంలో ఏకంగా ఐటీ,పంచాయితీ రాజ్శాఖ మంత్రిగా లోకేష్ ఉన్నారు.
ఓవైపు తన కుమారుడిని ప్రమోట్ చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నానా తిప్పలు పడుతుంటే.. నారా లోకేష్ మాత్రం తన మాటలతో స్వయంగా ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకుంటున్నారు. అసందర్భమైన మాటలతో, అనాలోచిత వ్యాఖ్యలతో లేనిపోని చిక్కుల్లో పడుతున్నారు. ఎప్పుడు ఎలా ఏం మాట్లాడాలో కూడా తెలియని స్థితిలో ఉన్న లోకేష్.. అడ్డంగా బుక్కవుతున్నారు.
ముఖ్యంగా ప్రతిపక్ష వైసీపీ నేతలు సందర్భం వచ్చినసారి లోకేష్ ను ఉతికారేస్తున్నారు. దీనికి తోడు పదే పదే ప్రసంగాల్లో దొర్లుతున్న తప్పులతో ప్రతిపక్షానికి కావాల్సినంత ఉప్పు అందిస్తున్నాడు లోకేష్. దీనిపై సోషల్ మీడియా జనం ఆయన్ను ఏకిపారేయడంతో.. చివరకు సోషల్ మీడియా పైనే చర్యలు తీసుకుంటానని, ఆవిధంగానూ అభాసుపాలయ్యారు.
ఇలా అయితే లాభం లేదనుకొని … ఇక చినబాబు చరిష్మా పెంచాలని టీడీపీ నాయకులు కంకణం కట్టుకున్నట్లు ఉన్నారు. ఏకంగా జగన్ పైనే పోటీకి కాలు దువ్వుతున్నారు. అది కూడా జగన్ కంచుకోట అయిన పులివెందులలో. దమ్ముంటే జగన్ పులివెందుల సీటు ఖాళీ చేయాలని, తమ యువనేత నారా లోకేష్ ఆ స్థానంలో పోటీ చేసి గెలుస్తారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తాజాగా సవాల్ విసిరారు. బుద్దా వెంకన్న ఏ ధైర్యంతో ఈ మాటన్నారో గానీ.. లోకేష్ను ఇక్కడినుంచి పోటీకి దింపడం మాట అటుంచితే.. ఇలాంటి సవాళ్లు లోకేష్ పొలిటికల్ కెరీర్ను ప్రమాదంలో పడేయడం ఖాయం. ఇదే మాట పట్టుకుని రేప్పొద్దున వైసీపీ వాళ్లు కూడా.. వచ్చే ఎన్నికల్లో దమ్ముంటే జగన్ పై పోటీ చేయాలని లోకేష్ కు సవాల్ విసిరితే పరిస్థితేంటి?. లేని చరిష్మాను ఊహించుకుని వైసీపీ నోటికి పని చెప్పడమే తప్పితే.. ఇలాంటి సవాళ్లతో మొదటికే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు.
Also Read