కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతితో ఖాళీ అయిన పోస్టు కోసం పోరాటాలు నడుస్తున్నాయి. సానుభూతి కోణంలో ఒకరు, ఎక్స్పీరియన్స్ యాంగిల్లో మరొకరు, పాత పరిచయాలు పట్టాలెక్కిస్తాయని ఇంకొకరు, అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయని వేరొకరు. ఇలా నలుగురు పోటీకి సై అంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఒకవేళ కంటోన్మెంట్కు ఉప ఎన్నిక వస్తే ఆ నలుగురిలో టికెట్ దక్కేది ఎవరికి ఇంతకీ ఎవరా నలుగురు
కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో పోటీలో ఉండాలని ఆశిస్తున్న అభ్యర్థులు రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. దివంగత సాయన్న మృతితో కంటోన్మెంట్కు ఉప ఎన్నిక వస్తుందా రాదా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆ పని పక్కన పెట్టిన ఆశా వాహులు తమ పని తాము చేసుకుపోతున్నారు. ముఖ్యంగా నలుగురు అభ్యర్థులు కంటోన్మెంట్ కోసం పోటీ పడుతున్నారు. వారిలో సాయన్న కూతరు లాస్య నందిత, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత గజ్జెల నగేష్, టీఎస్ ఎంటీసీ చైర్మన్ క్రిశాంత్, 2018లో బీజేపీ నుంచి పోటీ చేసి సాయన్న క్రింద ఓటమి పాలైన శ్రీ గణేష్ పోటీలో ఉన్నారు.
2018 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత కేటీఆర్ సమక్షంలో శ్రీ గణేష్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంటోన్మెంట్ పరిధిలో సామాజిక సేవ చేస్తూ ప్రజల్లో పట్టు పెంచుకుంటున్నారు. ఈ సారి టికెట్ తనకే వస్తుందన్న నమ్మకంతో ప్రచారం కూడా ప్రారంభిచారు. గతంలో బీజేపీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన అనుభవాన్ని అధిష్టానం పెద్దలు పరిగణలోకి తీసుకుంటారని గణేష్ బలంగా నమ్ముతున్నారు.
ఇప్పటికే కంటోన్మెంట్ బోర్డుకు నోటిఫికేషన్ వచ్చింది. చాలామంది బోర్డు ఎన్నికల్లో పోటీ చేసేందుకు తహతహలాడుతున్నారు. అదే సమయంలో కంటోన్మెంట్ నుంచి ఐదుసార్లు పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న మరణంతో నియోజకవర్గం సీటు ఖాళీ అయింది. దీంతో ఇక్కడి నుంచి కూడా చాలా మంది నేతలు అసెంబ్లీకి వెళ్లేందుకు పావులు కదుపుతున్నారు. పార్టీ పెద్దల ఆశిస్సులతో తమకు కూడా అవకాశం వస్తే వదులుకునే అవకాశం లేదని అంటున్నారు. అయితే ఈ నలుగురిలో ఒకక్కరు ఒక్కో రీతిలో పట్టు పెంచుకుంటున్నారు. చూడాలి మరి అదృష్టం ఎవరిని వరిస్తుందో.