తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది. ఇక తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇక ఏపీలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగనుండగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వే సంస్థలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఏజెన్సీ సి.ఎన్.ఎక్స్ తో కలిసి ఇండియా టివి నిర్వహించిన ఒపీనియన్ పోల్లో ఎవరు అధికారంలోకి రానున్నారనే విషయం వెల్లడైంది.
తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్, ఏపీలో జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి వస్తుందని తెలిపింది. అయితే గతంలో వచ్చిన సీట్ల సంఖ్య కాస్త తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణలో బీఆర్ఎస్కు 70 సీట్లు, కాంగ్రెస్ 34, బీజేపీ 7 సీట్లు,మజ్లిస్ 7 గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్కు ఎదురులేదని ఈ ప్రాంతంలోని 49 అసెంబ్లీ స్థానాల్లోనూ 27 సీట్లు గెలుచుకుంటుందని సర్వే వెల్లడించింది.
ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీకి 46 శాతం ఓట్లు రావచ్చని, టీడీపీకి 42 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది ఈ సర్వే. వైసీపీకి 18 లోక్ సభ స్థానాలు వస్తాయని, టీడీపీకి 7 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్, బీజేపీలు ఖాతా తెరవవని వెల్లడించింది.
