ఢిల్లీ NCRలో అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలన్న ఆగస్టు 11 తీర్పును సుప్రీంకోర్టు సవరించింది. శుక్రవారం జస్టిస్ విక్రం నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ NV అంజారియా లతో కూడిన మూడు సభ్యుల ధర్మాసనం తాజా ఆదేశాలను జారీ చేసింది. దాడి స్వభావం లేదా రేబిస్ ఉన్న కుక్కలనే షెల్టర్కు తరలించాలని చెప్పింది.
వీధి కుక్కలకు ఆహారం పెట్టడం చేయకూడదని… మున్సిపల్ సంస్థలు ప్రత్యేకంగా గుర్తించిన ప్రదేశాల్లోనే ఫీడింగ్ జరగాలని ఆదేశించింది. టీకా లేదా స్టెరిలైజేషన్ కోసం పట్టుకున్న కుక్కలను, ప్రాసెస్ పూర్తయ్యాక తిరిగి వాటి పరిసర ప్రాంతాల్లోనే వదలాలని ఆదేశించింది. జంతు ప్రేమికులు షెల్టర్లలోని కుక్కలను దత్తత తీసుకోవచ్చని కోర్టు తెలిపింది.
జంతువుల నియంత్రణలో భాగంగా మున్సిపల్ అధికారులు తీసుకునే చర్యలకు ఎవరూ అడ్డుకోవద్దని కోర్టు స్పష్టం చేసింది.ఈ ఆదేశాలు కేవలం ఢిల్లీ NCRకే కాకుండా దేశవ్యాప్తంగా అమలులోకి వస్తాయి అని తెలిపింది. .
ఎనిమిది వారాల తర్వాత ఈ కేసు మళ్లీ విచారణకు వస్తుందని కోర్టు తెలిపింది. అప్పటివరకు టీకాలు, స్టెరిలైజేషన్, షెల్టర్ మేనేజ్మెంట్, ఫీడింగ్ నిబంధనల అమలు పై అధికారులు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసును నిరంతర పర్యవేక్షణలో ఉంచుతూ, ప్రజా భద్రతా అంశాలు, జంతు సంక్షేమం రెండూ సమానంగా కాపాడే జాతీయ విధానం అవసరమని స్పష్టం చేసింది.
