ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లా పునర్విభజన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం
తెలిపింది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లికి మార్పు చేశారు.
రాజంపేటని కడప జిల్లాలో కలుపుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే కొత్తగా మదనపల్లి, మార్కాపురం, రంపచోడవరం, జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్నమయ్య జిల్లాలోని నియోజకవర్గాల మార్పు – జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో 28కి జిల్లాల సంఖ్య పెరగనుంది. ఎల్లుండి తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. గూడూరును తిరుపతి జిల్లా నుంచి నెల్లూరులో కలిపేందుకు, కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
అన్నమయ్య జిల్లాను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ జిల్లాలో మిగిలిన రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు నియోజకవర్గాలను మూడు జిల్లాల్లో కలపాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు స్పష్టత ఇచ్చింది. వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు చెరుకూరి శ్రీధర్, నిశాంత్ కుమార్లను అమరావతికి ఆదివారం పిలిపించారు. తుది ఉత్తర్వులు ఇవ్వడానికి వీలుగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ మేరకు ఇద్దరు కలెక్టర్లు అమరావతిలోనే మకాం వేశారు.
తిరుపతి జిల్లా నుంచి గూడూరును నెల్లూరులో కలుపుతున్న నేపథ్యంలో రైల్వేకోడూరును తిరుపతి జిల్లాకు, ప్రతిపాదిత మదనపల్లె జిల్లాలోకి రాయచోటి, కడపలోకి రాజంపేట నియోజకవర్గాన్ని కలపాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల విలీనాన్ని ఆయా నియోజకవర్గాల ప్రజల్లో సంతోష వాతావరణం కనిపిస్తోంది. పెనగలూరు, చిట్వేలి మండలాలకు తిరుపతి కాస్త దూరంగా ఉండనుంది. రాయచోటి నియోజకవర్గ ప్రజలు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది.
