కర్ణాటకలోని బెంగళూరు నగర పరిధిలో అబ్బిగేరే ప్రాంతంలో (సోలదేవనహళ్లి పోలీస్ లైన్స్ సమీపంలో) గృహ కలహాల నేపథ్యంలో 35 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మృతురాలిని సుష్మ (35)గా గుర్తించారు. ఆమె గతంలో డెల్ సంస్థలో పనిచేసినట్లు సమాచారం. ఐదేళ్ల క్రితం పునీత్ కుమార్ను వివాహం చేసుకున్న ఆమెకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు.ఇంట్లో చిన్నచిన్న విషయాలపై తరచూ వాగ్వాదాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. మంగళవారం వంట చేయడం విషయంపై అత్త కల్పనతో సుష్మకు వాగ్వాదం జరిగినట్లు సమాచారం.
సుష్మ కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం, అత్త ఆమెను వంట చేయనివ్వకుండా అడ్డుకోవడంతో పాటు పలు విషయాల్లో వేధింపులకు గురిచేసేదని తెలిపారు. ఈ నిరంతర వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన సుష్మ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.కట్నం వేధింపుల ఆరోపణలతో సుష్మ కుటుంబం ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమె భర్త పునీత్ కుమార్ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న అత్త కల్పన కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనపై సోలదేవనహళ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, సంఘటనకు దారితీసిన పరిస్థితులపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది.
గమనిక: ఎవరైనా మానసిక ఆందోళనలో ఉన్నట్లయితే వెంటనే నిపుణుల సహాయం పొందండి. AASRA హెల్ప్లైన్ (24/7): 91-9820466726 ను సంప్రదించవచ్చు.
