మద్యం మత్తులో కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడనే కోపంతో కన్నతండ్రి తన కుమారుడిని దారుణంగా అంతమొందించాడు. ఇంట్లో పనుల కోసం ఉంచిన థిన్నర్ను కుమారుడిపై పోసి నిప్పంటించడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన తమిళనాడులోని తూత్తుకుడిలో వెలుగుచూసింది.
తూత్తుకుడి మడత్తూర్ అమ్మన్ కోవిల్ వీధికి చెందిన అరుల్రాజ్ (32) గతంలో మద్యానికి బానిసై వ్యసన విముక్తి కేంద్రంలో చికిత్స పొంది ఇంటికి తిరిగి వచ్చాడు. కొంతకాలం బాగున్నా, ఇటీవల మళ్లీ పాత అలవాటుకు లోనయ్యాడు. మంగళవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన అరుల్రాజ్ తన తల్లిపై దాడి చేసి గాయపరిచాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన సోదరిని కూడా భయపెట్టి బెదిరించాడు. ఈ గొడవను ఆపేందుకు ప్రయత్నించిన తండ్రి దళముత్తును కూడా అరుల్రాజ్ చితకబాదాడు.
కుటుంబ సభ్యులపై నిరంతరం దాడులు చేస్తుండటంతో తండ్రి దళముత్తు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. అదే రోజు రాత్రి ఇంటి పక్కన అరుల్రాజ్ నిద్రిస్తుండగా, దళముత్తు ఇంట్లో ఉన్న థిన్నర్ను తీసుకువచ్చి అతనిపై పోసి నిప్పంటించాడు. మంటలు అంటుకోవడంతో తీవ్ర గాయాలపాలైన అరుల్రాజ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కుమారుడిని హత్య చేసిన తండ్రి దళముత్తును పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. మద్యపానం వల్ల కుటుంబంలో తలెత్తిన ఘర్షణ చివరకు ప్రాణాల మీదకు రావడంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది.
