నంద్యాల,కాకినాడ ఎన్నికల తర్తాత కర్నూలు జిల్లాలో పొలిటికల్ సీన్ శరవేగంగా మారుతోంది. టీడీపీ గెలిచిన ఊపులో ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపుతోంది. వైసీపీని బలంగా దెబ్బకొట్టాలంటె జిల్లాలో ముఖ్యనాయకులను పార్టీలోకి లాక్కొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. వైసీపీ ఓడటంతో పలువురు నేతలు ఫ్యానును పట్టుకుని వేలాడకుండా సైకిలెక్కేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అయితే ఇప్పటి వరకు అధికారికంగా రానప్పటికి లోలోపల మాత్రం చర్చలు జరుగుతున్నాయనె వార్తలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి 2014 ఎన్నికల్లో టీడీపీ కంటే వైసీపీకి కర్నూలులో ఎక్కువ స్థానాలొచ్చాయి. అయితే నంద్యాల ఉపఎన్నిక ఆ పార్టీది బలుపు కాదు వాపని తేలిపోయింది. దీంతో ఆ పార్టీ నేతలు అధికార పార్టీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. దీనిలో భాగంగానె రాయలసీమ పరిరక్షణ సమితి స్థాపించి సీమ ఉద్యమాన్ని నడిపిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి సైకిలెక్కేందుకు సిద్ధమైపోయారు.
వైసీపీ జిల్లా అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి, ఆయన సతీమణి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డిని టీడీపీలోకి తీసుకురావడానికి ఉపముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. వారిద్దరూ త్వరలోనే పార్టీ మారతారని జిల్లాలో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అలాంటి ఆలోచన తమకు లేదని గౌరు స్పష్టం చేసారు.
మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కూడా మళ్లీ టీడీపీలో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక నంద్యాలకు చెందిన పార్టీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పార్టీ మారతారనే సమాచారం అందుతోంది. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డికి రాజగోపాల్ రెడ్డి దగ్గరి బంధువు. దీంతో ఆయన కూడా టీడీపీలో చేరడం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి.
అయితే అటు టీడీపీ వర్గాలు కానీ, వైసీపీ నేతలు కూడా ఈ ఊహాగానాలపై స్పందించేందుకు సిద్ధంగాలేరు. ఇలా నేతలందరినీ చేర్చుకోవడం ద్వారా వారికి వచ్చే ఎన్నికల్లో సీట్లు ఎలా అడ్జస్ట్ చేయాలోనని టీడీపీ నేతలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. తమంతట తాము పార్టీలోకి వచ్చేవారిని మాత్రమే చేర్చుకోవాలని బాబు ఆలోచిస్తున్నారంట. అయితే పార్టీ మారె ఆలోచనలు లేవని గౌరు స్పష్టం చేసారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం.
