కాకినాడ కార్పొరేషన్ ను టీడీపీ సొంతం చేసుకుంది. మేయర్ పదవిని సుంకర పావనికి ఇవ్వడంతో పార్టీలో అసమ్మతి తారాస్థాయికి చేరింది. మేయర్ పదవిని ఆశించిన కార్పొరేటర్ శేషుకుమారి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడంతోపాటు పార్టీ అధిష్టానంపై తిరుగుబాటును ఎగరేశారు. ఇది మరువక ముందె డిప్యూటి మేయర్ పదవి చిచ్చురేకపింది.
కాకినాడ సిటీ నియోజకవర్గంలో కీలక ఓటర్లుగా ఉన్న మత్స్యకార వర్గాలను పార్టీ నేతలు పూర్తిగా నిర్లక్ష్యం చేశారంటూ మండిపడుతున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో మత్స్యకార వర్గాలైన వాడబలిజ అగ్నికుల క్షత్రియులకు 12 మందికి కార్పొరేటర్ సీట్లు కేటాయించగా 11 మంది విజయం సాధిస్తే కనీసం గుర్తింపు కూడా లేకపోయిందంటూ గగ్గోలు పెడుతున్నారు. విషయంలో ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు తాను ప్రాతినిధ్యం వహించే మత్స్యకార వర్గానికి న్యాయం చేయడంలో విఫలమయ్యారంటూ బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఈ విషయమై టీడీపీ అధిష్టానంతో తాడోపేడో తేల్చుకుంటామంటున్నారు.
ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుపై మత్స్యకార వర్గాలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తాను ప్రతిపాదించిన అభ్యర్థికి మేయర్ స్థానాన్ని దక్కించుకోలేకపోయిన కొండబాబు కనీసం సొంత సామాజికవర్గానికి డెప్యూటీ మేయర్ను కూడా ఇప్పించలేకపోయారంటూ మండిపడుతున్నారు. కార్పొరేటర్గా గెలుపొందిన అన్న కుమారుడు వనమాడి ఉమాశంకర్తోపాటు సీనియర్ కార్పొరేటర్ చోడిపల్లి సత్యప్రసాద్, మల్లాడి గంగాధర్, చవ్వాకుల రాంబాబు ప్రధానంగా డిప్యూటీ మేయర్ను ఆశించారు.
అయితె చివరి నిమిషంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ప్రతిపాదించిన అభ్యర్థి డిప్యూటీ మేయర్ పోస్టును దక్కించుకున్నారంటూ గగ్గోలుపెడుతున్నారు. ఈ వ్యవహారం పార్టీలో అంతర్గతంగా చిచ్చురేపుతోంది. మత్స్యకార వర్గాల ప్రాధాన్యతను ఎమ్మెల్యే వనమాడి పార్టీ ముఖ్యనేతల ఎదుట చెప్పడంలో విఫలమయ్యారని, అందువల్లే తమకు అన్యాయం జరిగిందంటూ వాపోతున్నారు. సొంత సామాజికవర్గం నుంచే తీవ్ర నిరసన వ్యక్తమవుతుండడంతో ఎమ్మెల్యేకు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది.
కాకినాడ టీడీపీలో డెప్యూటీ మేయర్ పదవి చిచ్చు రేపుతోంది. మేయర్ ఓసీ మహిళకు కేటాయించిన నేపథ్యంలో, డిప్యూటీ మేయర్ పదవిని మత్స్యకార వర్గానికి కేటాయిస్తారని ఆశించారు కాని పరిస్థితి తారుమారు అవడంతో అధిస్టానంపై ఆగ్రహంతో ఉన్నారు.