మంత్రి అఖిల, ఏవీ సుబ్బారెడ్డి మధ్య మరో సారి విబేధాలు రచ్చకెక్కాయి. అఖిల మంత్రి అయినప్పటినుంచి ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు ఉన్న సంగతి తెలసిందే. ఇద్దరి మధ్య అసమ్మతి రాగాలు ఎక్కువ అవడంతో ఆళ్లగడ్డ రాజకీయం తాజాగా మరోసారి వేడెక్కింది.
భూమా వర్థంతికి తనకు పిలుపు రాలేదని మంత్రి అఖిల ప్రియపై తీరుపై సుబ్బారెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భూమా నాగిరెడ్డి వర్థంతి రోజు అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఏవీ సుబ్బారెడ్డి..ఆమెతో విభేదాలు వాస్తవమేనని అంగీకరించారు. ఆళ్లగడ్డలో గుంట నక్కలు ఎవరో త్వరలో తేలుస్తానన్నారు.
వాస్తవానికి భూమా నాగిరెడ్డి మరణం తర్వాత మంత్రికి, ఏవీ సుబ్బారెడ్డికి మధ్య అంతరం పెరిగిపోయింది. ఒకరికి ఒకరు మాటలు లేకుండా రోజుల తరబడి ఉన్నారు. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో ఏవీ సుబ్బారెడ్డిని కలుపుకొని వెళ్లాలని సీఎం ఆదేశించారు. అయినప్పటికీ మంత్రి పొడిపొడిగానే మాట్లాడి చేతులు దులిపేసుకున్న సంగతి తెలిసిందే.
భూమాకు, ఏవీకి మధ్య సన్నిహిత సంబంధాలు అందరికీ తెలిసిందే. ఒకరికి తెలియకుండా మరొకరు ఎటువంటి వ్యవహారాలూ నడిపే అవకాశం లేనంతగా వారి మధ్య సంబంధ బాంధవ్యాలు ఉండేవి. అయితే, భూమా మరణం తర్వాత ఆ కుటుంబంతో ఏవీకి సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆర్థికపరమైన విషయాల్లోనే భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య విభేదాలు నెలకొన్నాయనేది వాస్తవం. తాజాగా భూమా వర్థంతి రోజు మరోసారి విబేధాలు బయటపడ్డాయి. ఈ నెల 29న తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్న ఏవీ సుబ్బారెడ్డి తెలిపారు.