ఎదురుపడి యుద్ధం చేసే సత్తా లేదు.. అందుకే వెనుక నుంచి దొంగ దెబ్బ తీస్తూ.. తెర ముందు శాంతి వచనాలు పలుకుతోంది పాకిస్తాన్. అందుకే అణుయుద్ధానికి దిగుతామంటూ పాక్కు చెందిన ఓ మంత్రి బెదిరిస్తాడు… అంతలోనే యుద్ధం వస్తే ఇరు దేశాలకు నష్టం వస్తుంది.. దీనికి చర్చలే పరిష్కారం అంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంటాడు.
ఈ మాటలను బట్టి చూస్తుంటే భారత్ను ఇరుకున పెట్టి.. యుద్ధానికి నో అని చెప్పించాలని దాయాది దేశం ప్లాన్ చేస్తోంది. పాక్ మాటలు చూసినప్పుడు బలంగా అనిపించినా.. దాని వెనుక ఉన్నది మాత్రం బలహీనతే. ఆర్థికంగా బలంగా ఉన్న భారత్ తో పోల్చినప్పుడు పాక్ పరిస్థితి దారుణంగా ఉందని చెప్పకతప్పదు. తాజాగా ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. దేశాధ్యక్షుడు.. ప్రధాని స్థాయి వారి విమాన ప్రయాణ ఖర్చుల్లోనూ కోత విధించిన పరిస్థితి. పొదుపు చర్యలు ఎంత ఎక్కువగా ఉన్నాయంటే.. అత్యున్నత స్థాయి వారు సైతం ఆచితూచి ఖర్చు పెట్టే పరిస్థితి.
భారత సైనిక బడ్జెట్ లో ఐదో శాతం కూడా పాక్ సైనిక బడ్జెట్ ఉండదు. మరి.. అంత బలహీనమైన దేశం.. ఈ రోజు అణుయుద్ధంచేస్తామన్నట్లుగా బెదిరింపులకు దిగటం వెనుక అసలు కారణం.. యుద్ధాన్ని నివారించటం.. భారత్ అడుగు ముందుకు వేయకుండా అడ్డుకోవటమే పాక్ ముందున్న ప్లాన్ అని చెప్పక తప్పదు.
ఈ విషయాలను కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. ప్రస్తుతం దేశం మొత్తం పాక్ చెరలో ఉన్న అభినందన్ గురించి ఆలోచిస్తుంది. కేంద్రం మాత్రం అతడిని విడిపించడానికి దౌత్య పరంగా చర్యలు చేపడుతూనే మరో కన్ను దాయాది దేశం చేస్తున్న పనులపై దృష్టి సారించింది.
ఇప్పటికే మోదీ, ఎన్ఎస్ఏ, రా, త్రివిధ దళాధిపతులతో అత్యవసర సమావేశం తరువాత సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నానని, ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గవద్దని ఆర్మీకి చెప్పేశారు. సరిహద్దుల్లో పాక్ ఎటువంటి కవ్వింపు చర్యలకు దిగినా, వాటిని తిప్పి కొట్టాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు తీర ప్రాంతాల్లో ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్స్ హై అలర్ట్ ప్రకటించాయి. మహారాష్ట్ర, గుజరాత్ కోస్ట్ లైన్ పరిధిలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో నేవీ, కోస్ట్ గార్డ్స్ లు సముద్రంలో తమ పెట్రోలింగ్ ను తీవ్రతరం చేశాయి.
