అంతర్జాతీయ వన్డేలకు వీడ్కోలు పలికేందుకు మరో క్రికెటర్ సిద్దమయ్యారు. సౌతాఫ్రియా క్రికెటర్ జేపీ డుమినీ ఈ వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు స్పష్టం చేశాడు. టీ20 ఫార్మాట్లో మాత్రం కొనసాగుతానని పేర్కొన్నాడు. 2017లో టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్న డుమినీ, వన్డే ఫార్మాట్ నుంచి సైతం వైదొలగాలని నిర్ణయించుకున్నాడు.
గతంలో 2011, 2015 ప్రపంచకప్లలో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించిన డుమిని మూడోసారి మెగాటోర్నీలో బరిలోకి దిగబోతున్నాడు. ఇదే నాచివరి వరల్డ్కప్ అంటూ ప్రకటించారచు. న్యూలాండ్స్ వేదికగా శ్రీలంకతో ఆఖరిదైన ఐదో వన్డే శనివారం జరగనుంది. స్వదేశంలో డుమినికిదే ఆఖరి వన్డే కావడం విశేషం.
వన్డేలకు గుడ్ బై చెప్పే సమయం వచ్చేసిందని బలంగా నమ్ముతున్నా. వరల్డ్కప్ తర్వాత తప్పుకోవడానికి సిద్ధమయ్యా. ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా సతమతమయ్యా. కుటుంబంతో మరింత ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతోనే ఇక వన్డేలనుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ డుమినీ 193 వన్డేలు ఆడగా 37. 39 సగటుతో 5,047 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్లో 68 వికెట్లు సాధించాడు. రాబోయే వరల్డ్కప్ డుమినీకి మూడోది. 2019 ఐపీఎల్ వేలానికి ముందు ముంబయి ఇండియన్స్ జట్టు జేపీని విడుదల చేసింది. వేలంలో అతన్ని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు.