ఫిరాయింపులపై అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన తెలుగుదేశంపార్టీలో కలకలం రేపుతోంది. ఒక వైపు ఫిరాయింపులను ప్రోత్సహించను అంటూనె…పార్టీలోకి రావాలంటె పదవులకు రాజీనామా చేయాలని పరోక్షంగా సంకేతాలిచ్చారు. వైసీపీ గేట్లు తెరిస్తే పార్టీలో రావడానికి టీడీపీ ఎమ్మెల్యేలు సిద్దంగా ఉన్నారని జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తమ పార్టీతో 8 మంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఓకే చెబితే చాలు వారంతా వచ్చి చేరిపోతారని కోటంరెడ్డి ప్రకటించారు.
టీడీపీ రాజ్యసభ సభ్యుడు కూడా రెండు నెలల నుంచి తమతో టచ్లో ఉన్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. 8 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు నేరుగా తనతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. జగన్ సరే అంటే సాయంత్రమే కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఈ విషయంలో పూర్తిక్లారిటీ ఇచ్చారని, రావాలనుకునే వారు ఎవరైనా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారని కోటంరెడ్డి ప్రకటించారు. అదే విధానానికి కట్టుబడి ఉంటామన్నారు.
తనతో టచ్లో ఉన్నవారిలో ఒకరు నియోజకవర్గంలో బలమైన ఎమ్మెల్యే అని, తాను వాళ్ల పేర్లు బయటపెట్టబోనని అన్నారు. క్షేత్రస్థాయిలో పలువురు మంది టీడీపీ నేతలు వైసీపీతో సంబంధాలు కొనసాగిస్తున్నారని వివరించారు. అయితే ఇప్పుడు ఆ 8 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరనే విషయం చర్చనీయాంశంగా మారింది.