రాహుల్ సిప్లిగంజ్ మాములుగా సింగర్ అని కొంత మందికి మాత్రమే తెలుసు. కానీ బిగ్బాస్-3లో విజేతగా నిలిచిన తర్వాత తని పేరు మారుమోగింది. ప్రతి ఒక్కరు ఇప్పుడు రాహుల్ ని గుర్తు పడుతారు. ప్రస్తుతం రాహుల్ కి విపరితమైన క్రేజ్ ఉంది. అయితే తాజాగా రాహుల్ సిప్లిగంజ్ పై బీరు బాటిళ్లతో దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన రాహుల్ ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. గత రాత్రి 11:45 గంటల ప్రాంతంలో రాహుల్ తన స్నేహితులు, ఓ గాళ్ఫ్రెండ్తో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్కు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడున్న కొంతమంది యువకులు రాహుల్ వెంట వున్న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. రాహుల్ కలగజేసుకోవడంతో వాగ్వివాదం పెద్దదైంది. అది మరింత ముదరడంతో ఇరు వర్గాలు దాడులకు దిగాయి. ఈ నెపథ్యంలో కొందరు యువకులు రాహుల్ తలపై బీరు సీసాలతో దాడికి దిగారు. తీవ్ర రక్తస్రావమైన రాహుల్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
రాహుల్ పై దాడికి పాల్పడిన వారిలో వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు కూడా ఉన్నట్టు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ దాడి గురించి రాహుల్ తల్లి ఏమంటుందంటే.. ‘నిన్న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లాడు.. ఓ మీటింగ్ ఉన్న నేపథ్యంలో వెళ్లాడు. రాత్రి ఇంటికి రాలేదు.. వాళ్ల నాన్న ఫోను చేసి కాసేపు మాట్లాడారు. ఉదయం టీవీలో న్యూస్ చూసి దాడి విషయాన్ని తెలుసుకున్నాం. ఓ పని మీద బయటకు వెళ్లాడు.. దాడి గురించి మాకు ఏమీ తెలియదు. ఏ ఆసుపత్రిలో ఉన్నాడన్న విషయం కూడా నాకు తెలియదు. నా భర్త ఆసుపత్రికి వెళ్లారు. కాసేపట్లో నేను కూడా ఆసుపత్రికి వెళ్తాను’ అని చెప్పారు.