‘భరత్ అనే నేను’ సినిమా సూపర్స్టార్ మహేశ్బాబుకు రెండు ఫ్లాపు సినిమాల నుంచి కోలుకునేలా చేసేటట్టు కనిపిస్తోంది. తొలిసారిగా ముఖ్యమంత్రి పాత్రలో కనిపించడం.. తనకు బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివతో కలిసి మళ్లీ పని చేయడం.. పోస్టర్లు.. పాటలు సూపర్గా ఉండడంతో బొమ్మ హిట్ అనే టాక్ సొంతం చేసుకుంది.
ఇప్పుడు ఈ సినిమా ఆడియో వేడుక హైదరాబాద్లోనే ఏప్రిల్ 7వ తేదీన నిర్వహించనున్నారు. అయితే ఆ వేడుకకు ముందే ఏప్రిల్ 1వ తేదీన ‘ఐ డోంట్ నో’ అనే పాట విడుదల చేయనున్నారు. అయితే ఆ పాట పాడింది ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ గాయకుడు, నటుడు ఫర్హాన్ అక్తర్. అతడి సుమధురమైన గొంతుతో ఈ పాట పాడారని తెలిసి ఖుషీ అవుతున్నారు. ‘రాక్ ఆన్’, ‘భాగ్ మిల్కా భాగ్’ సినిమాలతో బాలీవుడ్తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఫర్హాన్ అక్తర్ ఇప్పుడు తొలిసారి తెలుగు సినిమాకు పాట పాడుతున్నాడు. రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతంలో ఫర్హాన్ అక్తర్ ఐ డోంట్ నో తో అలరించే అవకాశం ఉంది. ఈ పాట ఏప్రిల్ 1వ తేదీన విడుదల చేయనున్నారు. మరీ ఈ పాట ఏ రేంజ్లో ఉండబోతోందో చూడాలి. ‘ఐ డోంట్ నో’ పాటను సినిమాలో స్పెయిన్లో తెరకెక్కించారు.
ఫర్హాన్ అక్తర్ మంచి గాయకుడు. ‘జిందగీ నా మిలేగీ దోబారా’,‘వజీర్- షాది కే సైడ్ ఎఫెక్ట్స్’లాంటి సినిమాలకు పాటలు పాడి అవార్డులు పొందాడు. ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా శరత్ కుమార్, ప్రకాశ్రాజ్, పోసాని కృష్ణమురళీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.