సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేశ్ తుదిశ్వాస విడిచారు. గత నెల 26న ఆయన ఏపీలోని నెల్లూరు జిల్లా గూడురు వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ముందుగా నెల్లూరులోని ఓ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందించి అనంతరం మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలోకు తరలించారు. అయితే కత్తి మహేశ్ ఇవాళ మధ్యాహ్నం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల ఆయన శరీరం చికిత్సకు సహకరించలేదని అందుకే ఆయన ప్రాణాలు కోల్పోయారని చెన్నైలోని అపోలో వైద్యులు తెలిపారు.
కత్తి మహేశ్ సామాజిక మాధ్యమాల్లో ఎంతో యాక్టివ్గా ఉండేవాడు. దళితవాదిగా, సినీ విమర్శకుడిగా తన భావాలను స్వేచ్ఛగా వెల్లడించేవాడు. అయితే ఓ వర్గం వారికి ఆయన పోస్టులు నచ్చేవి కావు. ఇక ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ మీద కత్తి మహేశ్ విమర్శలు చేసేవాడు.
కత్తి మహేష్ మృతిపట్ల సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖలు సైతం సంతాపం తెలుపుతున్నారు. ఆయన స్నేహితులు కత్తి మహేశ్ త్వరలోనే కోలుకుంటాడని చెప్పారు. డాక్టర్లు కూడా కత్తి మహేష్ ఓ కన్ను కోల్పోయారని, ప్రాణానికి ప్రమాదం లేదని చెప్పారు. ఐసీయూ నుంచి జనరల్ వార్డ్ కు కూడా తరలించారు. ఇంతలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఇక కత్తి మహేశ్ చికిత్స కోసం ఏపీ ప్రభుత్వం రూ. 17 లక్షలు మంజూరు చేసిన విషయం తెలిసిందే.