దర్శకుడు హరీష్ శంకర్- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉండగా విడుదలకు ముందు సోషల్ మీడియాలో జరిగిన ఒక ట్వీట్ వివాదం కారణంగా ఆయనపై కొంత విమర్శలు వచ్చాయి.
ఎక్స్ లో ఓ యూజర్ చేసిన పోస్ట్కు హరీష్ శంకర్ “తథాస్తు” అని రిప్లై ఇచ్చారు. ఆ ట్వీట్లో పరోక్షంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల కలెక్షన్లపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు ఉన్నాయని అభిమానులు భావించారు. దీంతో మహేష్ బాబు అభిమానులు హరీష్ శంకర్పై సోషల్ మీడియాలో విమర్శలు చేయడం ప్రారంభించారు.
ఈ వివాదంపై స్పష్టత ఇవ్వడానికి హరీష్ శంకర్ స్వయంగా సోషల్ మీడియాలో ఒక నోట్ విడుదల చేశారు. నిన్న చాలా బిజీగా గడిచింది. సెన్సార్ అనంతరం బోర్డు అధికారులతో మీటింగ్ జరిగింది. తర్వాత ఆశీర్వాదాల కోసం పెదమ్మ ఆలయానికి వెళ్లాను. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు, పాట ప్రోమో ఫైనల్ చెక్స్, ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తి చేసి చివరకు థమన్ స్టూడియోకు వెళ్లి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులు చూసుకున్నాను అని వివరించారు.
ఈ సమయంలో అనేక మంది జర్నలిస్టులు, అభిమానులు, శుభాకాంక్షలు తెలిపినవారికి రిప్లై ఇస్తున్నానని, ఆ తొందరలో ఒక ట్వీట్ను పూర్తిగా చదవకుండా కోట్ చేశానని తెలిపారు. కొద్ది సేపటికే తన టీమ్ దానిపై దృష్టి పెట్టి చెప్పడంతో వెంటనే ఆ ట్వీట్ను తొలగించానని చెప్పారు.
తనకు మహేష్ బాబు అంటే ఎంతో గౌరవం ఉందని హరీష్ శంకర్ స్పష్టం చేశారు. ఆయన పేరుతో ఇంకా ఎన్నో రికార్డులు సృష్టించబడతాయని తాను నమ్ముతున్నానని అన్నారు. తన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు. సినిమా విడుదలకు ముందు అభిమానుల ప్రేమ, మద్దతు ఎంత ముఖ్యమో తనకు తెలుసని, అందుకే అందరూ ఈ సినిమాకు మద్దతు ఇవ్వాలని కోరారు.
