ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా వస్తున్న దేవరపై భారీ అంచనాలు నెలకొనగా 2024 ఏప్రిల్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఎన్టీఆర్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తున్నారు.
ఇక తాజాగా సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు కొరటాల శివ. ఇందుకు సంబంధించిన వీడియోని రిలీజ్ చేసిన ఆయన రెండు పార్టులుగా సినిమా విడుదల కానుందని చెప్పారు. సినిమా కథ విషయంలో ఎన్టీఆర్తో సహా మేమంతా ఉద్వేగానికి లోనయ్యామని చెప్పారు. ప్రతి పాత్ర బలంగా ఉంటుందని కొన్ని షెడ్యూల్స్ తీసిన తర్వాత మాలో రెట్టింపు ఉత్సాహం వచ్చిందన్నారు. సినిమా నిడివిని దృష్టిలో పెట్టుకుని ఒక్క సన్నివేశం, ఒక్క సంభాషణ కూడా తొలగించలేమని అంతా ఫీలయ్యామని అందుకే ఒక్క పార్టులో చూపించాలంటే కష్టమని భావించి రెండో పార్టు కూడా తీస్తున్నామని చెప్పారు.
అభివృద్ధి చెందని ఓ తీర ప్రాంత నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా రూపొందుతుందన్నారు. తమకు భయం తెలియదంటూ విర్రవీగే వారికి భయాన్ని పరిచయం చేసే పవర్ ఫుల్ పాత్రలో తారక్ కనిపించనున్నారని చెప్పారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.