రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో తెరకెక్కిన పవర్ఫుల్ సినిమా ‘అరవింద సమేత వీర రాఘవ’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో. పూజా హెగ్డే హీరోయిన్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్.రాథాకృష్ణ(చినబాబు) నిర్మించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. అరవింద సమేత వీర రాఘవ’ ట్రైలర్ ను నందమూరి కల్యాణ్ రామ్ విడుదల చేశారు.వేడుకలో కల్యాణ్ రామ్, దర్శకుడు త్రివిక్రమ్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ, నటీనటులు జగపతిబాబు, సితార, సునీల్, పాటల రచయితలు సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, సంగీత దర్శకుడు తమన్ తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇప్పుడు తాజాగా విడుదలైన ట్రైలర్ అంచనాలను శిఖర అంచులకు తీసుకుపోతోంది. ఎన్టీఆర్ నట విశ్వరూపంలోని మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రం ‘అరవింద సమేత’ అని ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తన కలానికి మరింత పదును పెట్టినట్టు స్పష్టంగా తెలుస్తోంది.