సినీ పరిశ్రమకు పైరసీ అనే వ్యాధి తగులుకుంది. ఏ సినిమాకైనా పైరసీ జాడ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. కష్టపడి తీసిన సినిమాలు మార్కెట్లో, ఆన్లైన్లో అందుబాటులో ఉండడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఎన్ని పట్టుచర్యలు చేపట్టినా అది వీడడం లేదు. సినిమా విడుదలైన గంటల్లోనే ఎక్కడో ఒక చోట సినిమా విడుదలైన రోజే ఆ సినిమా బయటకు లేదా ఆన్లైన్లో ప్రత్యక్షమవుతోంది.
దీంతో సినీ పరిశ్రమ ఆందోళనలో పడాల్సి వస్తోంది. పైరసీతో తమ పొట్ట గొడుతున్నారని దర్శక, నిర్మాతలు వాపోతున్నారు. పైరసీని నివారించాలని ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సినీ పరిశ్రమకు చెందిన వాళ్లు కొన్నాళ్లు ఆందోళన చేశారు కూడా. అయినా సమస్య పరిష్కారం కాలేదు. అయితే ఇప్పుడు ఈ పైరసీపై దర్శకుడు, నిర్మాత కోన వెంకట్ స్పందించారు. పైరసీని ప్రోత్సహిస్తున్న ఓ వెబ్సైట్పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేస్తూ డిమాండ్ చేశారు.
తెలుగు సినిమాకు ప్రమాదకరంగా మారిన మూవీ రూల్జ్ (movierulz) వెబ్సైట్పై వెంటనే చర్చలు తీసుకోవాల్సిందిగా కోన వెంకట్ ట్విట్టర్లో కోరారు. కేటీఆర్కు ట్యాగ్ చేశారు. తన మెసేజ్తోపాటు గతవారం విడుదలైన గాయత్రి, ఇంటిలిజెంట్, తొలిప్రేమ సినిమాలు మూవీరూల్జ్ సైట్లో ఉన్న స్క్రీన్ షాట్ను కూడా పోస్ట్ చేశారు. అయితే దీనిపై మంత్రి కేటీఆర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో.. ఎలా స్పందిస్తారో చూడాలి.