ఈసారి క్రిస్మస్కు సినిమా పండుగ రానుంది. ఒకేసారి ముగ్గురు హీరోలు పోటాపోటీగా ప్రేక్షకుల చెంతకు వస్తున్నారు. రోజు విడిచి రోజు వరుసగా ముగ్గురు థియేటర్లలోకి రానున్నారు. సంవత్సరం ముగింపునకు వెండి తెరకు మంచి ముగింపు ఇవ్వాలని వారందరూ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే పోటీ అని కాకుండా వాళ్లు ప్రకటించిన సినిమాలు పూర్తయ్యి ఆ సమయానికి వస్తున్నాయంతే. అయితే ఈసారి రెండు ముఖ్యమైన కుటుంబాల నుంచి నటులు వస్తున్నారు. తొలి సినిమాతో పరాజయం మూటగట్టుకున్న అక్కినేని వారసుడు అఖిల్ డిసెంబర్ 22వ తేదీన హలో అంటూ వచ్చేస్తున్నాడు. 23వ తేదీ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ ఒక్క క్షణం అంటూ థియేటర్లలోకి వస్తానంటున్నాడు.
అయితే నాని మిడిల్ క్లాస్ అబ్బాయ్గా వస్తానంటున్నాడు. కానీ ఆ సినిమాలకు ముందా వెనకా అని ఏమీ తేలడం లేదు. ప్రస్తుతం నిర్మాత మధ్య దీనిపై చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. తన తనయుడు సినిమా కోసం అల్లు అరవింద్ ఎంసీఏ సినిమాను వాయిదా వేసుకోవాలని, లేదా ముందు విడుదల చేసుకోవాలని చిత్ర నిర్మాత దిల్ రాజును కోరినట్లు సినీ వర్గాల టాక్. సినిమా థియేటర్ల కొరత ఏర్పడుతుందనే దృష్టితో అరవింద్ కోరినట్లు తెలుస్తోంది. ఇక నాని సినిమా అంటే హిట్ అనే టాక్ ఉంది. అందులో ఫిదా ఫేమ్ సాయి పల్లవితో వస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.