సినీ పరిశ్రమకు చెందిన డిస్కో శాంతి, లలిత కుమారిల మేనకోడలు అబ్రిన్ (17) అదృశ్యం ఇప్పుడు కలకలం రేపుతోంది. అబ్రిన్ అదృశ్యం కాగా.. ఆమె ఆచూకి ఇంక లభించలేదు. ఈ క్రమంలో అబ్రిన్ తల్లి సెరిల్, మేనత్త డిస్కోశాంతి మీడియా ముందుకు వచ్చారు.
చైన్నైలోని టీనగర్లో లలిత కుమారి, డిస్కోశాంతిల సోదరుడు, సహాయ దర్శకుడైన అరుణ్ మొళివర్మన్ కుటుంబం నివాసం ఉంటున్నారు. ఈయన కుమార్తె అబ్రిన్ నగరంలోని చర్చ్ పార్క్ స్కూల్లో ప్లస్ టూ చదువుతోంది. ఈ నెల 6వ తేదీన స్కూల్కు వెల్లిన అబ్రిన్.. ఆ తర్వాత ఇంటికి తిరిగిరాలేదు. ఆ అమ్మాయి కోసం బంధువులు, స్నేహితులు, చైన్నైలోని వివిధ ప్రాంతాల్లో తిరిగినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో వారు పాండీ బజార్ పోలీసులను ఆశ్రయించారు. కానీ, అదృశ్యమై వారం రోజులైనా ఆచూకీ లభించక పోవడంతో వారు కంగారు పడుతున్నారు. పోలీసులు మాత్రం ఇప్పటికే అబ్రిన్ చదువుతున్న చర్చ్ పార్క్ స్కూల్లో విచారించారు. అలాగే ఆ పరిసరాల్లోని 56 సీసీ టీవీల పుటేజ్ను పరిశీలించారు.
అయినా, ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. ఈ విషయంలో పాఠశాల యాజమాన్యం పట్టించుకోలేదని అంటున్నారు. మీడియా ద్వారా మా అమ్మాయి ఆచూకీ దొరకుతుందన్న ఆశతో మీ ముందుకు వచ్చినట్టు వారిద్దరూ బోరున విలపిస్తూ విలేకరుల వద్ద వాపోయారు. అబ్రిన్ తల్లి సెరిల్ మాట్లాడుతూ తమ బిడ్డ ఆచూకీ తెలిస్తే తెలియజేయాలని కోరింది.