సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ప్రస్తుతం అక్కడ వైద్యచికిత్సలు చేయించుకుంటున్నారు. రజినీకాంత్ కు పదేళ్ల కిందట సింగపూర్ లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఇది జరిగి పదేళ్ళు పూర్తి కావడంతో రెగ్యులర్ మెడికల్ చెకప్ కోసం ఆయన భార్య, కుమార్తెతో కలసి వారం క్రితం అమెరికాకు వెళ్లారు.ఇందుకోసం ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నారు.
శనివారం ఆయన తన కుమార్తె సౌందర్యతో అమెరికాలోని మయో క్లినిక్ కు వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం తిరిగి వస్తున్న సమయంలో ఎవరో ఆయన ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఫోటోలో రజనీకాంత్ తో పాటు ఆయన కుమార్తె సౌందర్య, ఇంకొక వ్యక్తి ఉన్నారు. రజినీకాంత్ వైద్య చికిత్సల కోసం మరికొన్ని రోజులు అమెరికాలోనే గడపనున్నారు. ప్రస్తుతం ఆయన అల్లుడు ధనుష్ కూడా ఓ హాలీవుడ్ సినిమా చిత్రీకరణ కోసం అక్కడే ఉంటున్నారు.
ప్రస్తుతం రజనీకాంత్ అన్నాత్తే అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఆయన పార్ట్ షూటింగ్ పూర్తయింది. డబ్బింగ్ కూడా పూర్తిచేసారు. దీపావళి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. మరోవైపు రజనీకాంత్ నటించే ఆఖరి సినిమా ఇదేనని వార్తలు వస్తున్నాయి. దీంతో రజనీ ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు.
Also Read