తమిళ సూపర్స్టార్ తలైవా తన సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో మహేశ్బాబు, అల్లు అర్జున్ సినిమాలు ఆందోళనలో పడ్డాయి. రజనీ సినిమా ప్రకటన వీరిద్దరి సినిమాలను ఇరకాటంలో పడేశాయి. కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కాలా’ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా విడుదల తేదీని ఏప్రిల్ 27 అని ప్రకటించారు.
ఈ సినిమాను రజనీకాంత్ అల్లుడు, తమిళ హీరో ధనుశ్ నిర్మిస్తున్నాడు. రజనీ మరో సినిమా 2.ఓ ఆలస్యమడంతో ఈ సినిమాను వేసవిలో విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే ఏప్రిల్ 27వ తేదీన తమ సినిమాలు విడుదల చేయాలని మహేశ్బాబు, అల్లు అర్జున్ ప్రణాళికలు వేసుకున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్బాబు ‘భరత్ అనే నేను’ సినిమా వస్తోంది. ఆ తర్వాత వక్కంతం వంశీని దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలను ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. కానీ రజనీ ప్రవేశంతో వీరిద్దరి సినిమాలు పునరాలోచనలో పడ్డారు. దీంతో ఈ సినిమాల విడుదల తేదీల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది.
రజనీకాంత్ సినిమా తమిళ్, తెలుగు, హిందీ పరిశ్రమల్లో పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నారు. అయితే మహేశ్, అర్జున్ కూడా అదే రోజున వస్తే మాత్రం ఒకేసారి ముగ్గురు టాప్ హీరోలు థియేటర్లలోకి వస్తే మాత్రం భారీ పోటీ ఏర్పడుతుంది. వీటికి థియేటర్ల సమస్య కూడా తలెత్తుంది. మరి చివరికి ఈ సినిమాల విడుదలలో ఎలా మార్పు ఉంటుందో లేదో చూడాలి.