చేంబోలు సీతారామశాస్త్రి.. ఇలా చెబితే తెలియదు. సిరివెన్నెల సీతారామశాస్త్రి.. తెలుగు పాటకు వెలుగులద్దిన గీతరచయిత. కఠినమైన సమాసాలను కమనీయంగా కూర్చి, గమ్మత్తైన మాటలకు అర్థాల సొగసు అద్ది అద్భుతమైన పాటలు రాశారు. ఆ పాటలకు అనేక సార్లు నంది బహుమతులు నడుచుకుంటూ వచ్చాయి. అందులో ఐదు పాటల గురించి ఇక్కడ..
ఆదిభిక్షువు వాడినేది కోరేది (సిరివెన్నెల)
సీతారామశాస్త్రి గారి తొలి సినిమా ఇది. ఇదే చివరకు ఆయన ఇంటిపేరుగా మారింది. ఇందులో ఆయన రాసిన పాటలన్నీ చాలా ప్రాచుర్యం పొందాయి. ఈ పాట ప్రత్యేకంగా నిలిచింది. శివుడిని నిందాస్తుతితో కీర్తించే పాట ఆయనకు నంది అవార్డ్ను తెచ్చిపెట్టింది.
తెలవారదేమో స్వామి (శ్రుతిలయలు)
‘శ్రుతిలయలు’ సినిమాలోని ఈ పాట అద్భుతంగా ఉంటుంది. జేసుదాస్ పాడిన తెలుగు పాటల్లో ఒక ఆణిముత్యంగా నిలిచింది. ఈ పాట నంది అవార్డుల జ్యూరీ ముందుకు వెళ్లినప్పుడు, దీన్ని అన్నమాచార్య కీర్తన అని పక్కన పెట్టారట. ఆ తర్వాత నిజం తెలిసి, నందిని ఆయనకు అందించారు.
అందెల రవమిది(స్వర్ణకమలం)
స్వర్ణకమలం సినిమాలో పాటలన్నీ నేటికీ నిత్యనూతనంగా ఉంటాయి. అందులో క్లైమాక్స్లో వచ్చే ఈ పాట కళ గొప్పతనాన్ని, కళాకారుల హృదయాన్ని ఆవిష్కరిస్తుంది. ఈ పాటకూ ఆయన నందిని కైవసం చేసుకున్నారు.
అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని (సింధూరం)
తెలుగు సినిమా చరిత్రలో మిగిలిపోయే పాట ఇది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘సింధూరం’ సినిమాలో టైటిల్ సాంగ్ అయిన ఈ పాట దేశంలోని అన్యాయాల్ని, దురాగతాల్ని ప్రశ్నిస్తుంది. ఈ పాటకూ ఆయన నందిని పొందారు.
జగమంత కుటుంబం నాది (చక్రం)
ఇది ఈ సినిమా కోసం రాసింది కాదు. సిరివెన్నెల ఏనాడో రాసిన పాటను ఈ చిత్రానికి వాడుకున్నారు దర్శకుడు కృష్ణవంశీ. జీవిత తత్వాన్ని అద్భుతమైన మాటలతో మనముందు ఉంచారు సిరివెన్నెల. ఆయన ఖాతాలో మరో నందిని చేర్చింది ఈ పాట.