గొప్పలు చెప్పుకోవడం కాదు.. కొంచెం కోలీవుడ్ను చూడండి
శ్రీదేవిని విస్మరించిన టాలీవుడ్.. ఘన నివాళులర్పించిన తమిళ్ సినీ పరిశ్రమ
తెలుగు సినీ పరిశ్రమ గొప్ప.. భారతదేశంలోనే మంచి మార్కెట్ ఉన్న సినీ పరిశ్రమ అని గొప్పలు చెప్పుకోవడం కాదు.. కొంచెం తమిళ సినీ పరిశ్రమను చూసి నేర్చుకోవాల్సిన అవసరం చాలా విషయాల్లో టాలీవుడ్కు ఉంది. ఈ విషయం ప్రతిసారీ రుజువవుతూనే ఉంది. రెండేళ్ల కిందట జల్లికట్టు కోసం తమిళ్ సినీ పరిశ్రమ మొత్తం తరలివచ్చింది. ఆ తర్వాత చెన్నై వరదల సమయంలో బాధితుల ముందు స్టార్ హీరోలు, నటీనటులు వాలిపోయి సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. మొన్న చేపట్టిన థియేటర్ల బంద్ విషయంలోనూ ఇంకా కొనసాగుతోంది. తమ డిమాండ్లు అంగీకరించే దాక ఊరుకునేది లేదని చెబుతూ ఇంకా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు శ్రీదేవి మృతి విషయంలోనూ వాళ్లు ఆదర్శంగా నిలిచారు. శ్రీదేవి మృతికి సంతాపంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి తమిళ సినీ పరిశ్రమ అంతా కదిలివచ్చింది.
మన టాలీవుడ్ ఉంది ఇప్పటివరకు ఒక్క అధికారిక కార్యక్రమం శ్రీదేవి కోసం నిర్వహించలేదు. తమిళ్ కన్నా తెలుగులోనే అతిలోకసుందరి శ్రీదేవి అద్భుతమైన సినిమాల్లో నటించింది. ఇక్కడే స్టార్డమ్ తెచ్చుకొని తెలుగు బిడ్డగా శ్రీదేవి నడయాడింది. ఆమెతో టాలీవుడ్కు చెందిన వారితో సత్సంబంధాలు ఉన్నాయి. దర్శకులు, నిర్మాతలు, నటీనటులు శ్రీదేవి కుటుంబంలో ఒకరిగా ఉంటారు. అలాంటి వారు తెలుగు సినీ పరిశ్రమలో శ్రీదేవి మృతి చెందిన సందర్భంగా ఒక సంతాప సభ.. శ్రీదేవిని స్మరించుకోవడానికి ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదు.
ఇలాంటి అపకీర్తి వస్తదని భావించి వ్యాపారవేత్త, సినీ పరిశ్రమతో సంబంధం ఉన్న టి.సుబ్బిరామిరెడ్డి తన హోటల్ పార్క్ హయత్లో శ్రీదేవి సంతాప సభ నిర్వహించారు. ఆ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో నటీనటులు ఎవరూ రాలేదు. ఓ పది మంది ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. దీన్నిబట్టి అర్థమవుతోంది ఏందంటే కేవలం సినిమాల వరకే వారితో సంబంధం. ఆ తర్వాత వాళ్లకు తమకు సంబంధం లేనట్టు టాలీవుడ్కు చెందిన వారు ప్రవర్తిస్తుంటారు. ఇది అన్నీ విషయాల్లోనూ తెలుస్తోంది. అభిమానులను పట్టించుకోవడం కూడా అది ఎంతవరకంటే సినిమాల కోసమే.
ఆ తర్వాత సినిమా అభిమానులు, ప్రేక్షకులు ఏమైనా పట్టించుకోరు. రెండేళ్ల కిందట హైదరాబాద్ శివారు ప్రాంతాలు నీట మునిగితే ఎవరూ స్పందించలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా కోసం అందరూ పోరాడుతున్నారు. కానీ సినీ పరిశ్రమకు చెందని వారు మాత్రం నోరు మెదపడం లేదు. వాళ్లు కూడా వచ్చి రోడ్ల పడితే ఏమవుతుంది. రెండు రోజుల కాల్షీట్లు దెబ్బతింటాయి. అంతే కదా! అందరూ కలిసొస్తే కేంద్రం దెబ్బకు దిగి వస్తుంది. ఈ విషయాన్ని వాళ్లు పట్టించుకోవడం లేదు.
మద్రాస్ నుంచి వేరు పడిన టాలీవుడ్ కొంచెం ఆ లక్షణాలను ఒంట బట్టించుకోవాలి. వారి సేవా గుణాలు, వాళ్లు తీసే సినిమాలను స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ కూడా అమలు చేయాలి. అలా అయితే ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతారు. సినీ పరిశ్రమ కష్టాల్లో ఉంటే ఆదుకుంటారు. మనం మంచి చేస్తే మంచే జరుగుతుందనే విషయం ముమ్మాటికి అక్షరసత్యం. అందుకే తమిళనాడులో మంచి చేయడంతోనే రాజకీయాల్లోనూ సినిమా వాళ్లు రాణించడానికి కారణం అదే.
https://www.adya.news/telugu/gallery/kollywood-pays-tribute-to-late-superstar-sridevi/