తన తండ్రి ఏఎన్నార్ మాదిరి అక్కినేని నాగార్జున ఇతర నటీనటులతో సినిమాల్లో నటించడానికి ముందు ఉంటున్నారు. మంచు మోహన్బాబుతో ‘అధిపతి’, శ్రీకాంత్తో ‘నిన్నే ప్రేమిస్తా’లాంటి సినిమాలు చేసిన నాగార్జున తమిళ భాషలోనూ ఇతరులతో కలిసి సినిమాలు నటించాడు. ఇప్పుడు తన కుమారుల (నాగ చైతన్య, అఖిల్) కెరీర్ను చూసుకుంటూ తనకు తాను సినిమాలు కూడా చేసేస్తున్నాడు. ప్రస్తుతం రామ్గోపాల్వర్మ దర్శకత్వంలో శివ సీక్వెల్ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నానితో కలిసి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ సినిమాలో హాస్యపూరితమైన డాన్ పాత్రలో కనిపించనున్నారట. అయితే ఇప్పుడు మరో వార్త షికార్లు చేస్తోంది.
ఇప్పుడు భాష బేధం లేకుండా సరిహద్దు దాటి పక్కన ఉన్నటువంటి తమిళ్ సినీ పరిశ్రమకు వెళ్లనున్నారు. స్టార్ హోదా పొందిన నటుడు ధనుశ్తో కలిసి ఓ సినిమా చేయనున్నారని సమాచారం. ఇంతకుముందే తమిళ యువ నటుడు కార్తీతో కలిసి నాగార్జున ‘ఊపిరి’ సినిమా చేశారు. ఆ సినిమా ప్రేక్షకుల మదిని దోచింది. నానితో నటించే సినిమా సెట్స్ మీదికి వెళ్లకముందే నాగార్జున ధనుశ్తో కలిసి నటింనున్నారట. ఓ కథను ఇప్పటికే నాగార్జున విన్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా బహుభాషల్లో విడుదల చేయనున్నారని సమాచారం. ఇంకా కథపై చర్చలు కొనసాగుతున్నాయట. ఈ సినిమా నిజమైతే రెండు సినీ పరిశ్రమలకు హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది.