డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల (డీఎస్పీ)పై తెలుగు సినీ పరిశ్రమ పోరాటం ప్రారంభించింది. కష్టపడి తీసిన సినిమాలకు వేరొకరు దోచుకోవడంపై టాలీవుడ్ ఆగ్రహంతో ఉంది. దీనికి నిరసనగా మార్చి 1వ తేదీ నుంచి థియేటర్ల బంద్ను ప్రకటించారు. ఈ ఆందోళనకు తమిళనాడు సినీ పరిశ్రమ కోలీవుడ్ కూడా మద్దతు తెలిపింది. ఈ బంద్కు తమిళ నిర్మాతల మండలి కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతూ తాము కూడా తమిళనాడులో థియేటర్ల బంద్ చేపడతామని స్పష్టం చేసింది.
సమస్యలు పరిష్కరించకుంటే మార్చి 1వ తేదీ నుంచి టాలీవుడ్లో బంద్ తప్పదని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్పీసీ) స్పష్టం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల (డీఎస్పీ) విధానాన్ని సమూలంగా మార్చాలని సినీ పెద్దలు కోరుతున్నారు. దీనిపై హైదరాబాద్లో ఇటీవల నిర్వహించిన సమావేశానికి తమిళ నిర్మాతల మండలి నుంచి విశాల్ హాజరయ్యాడు. టాలీవుడ్ చేస్తున్న పోరాటానికి మద్దతు పలికాడు.
యూఎఫ్ఓ, క్యూబ్, పీఎక్స్ డీలాంటి డీఎస్పీలతో తెలుగు, తమిళ సినిమాలు నష్టపోతున్నాయని విశాల్ ఆందోళన వ్యక్తం చేశారు. కోలీవుడ్లోని మిగతా నిర్మాతలతో చర్చించి మార్చి 1వ తేదీ నుంచి తమిళనాడులో కూడా థియేటర్లలో బంద్ పాటించాలని నిర్ణయించారు. డీఎస్పీలు అందరికీ ఆమోదయోగ్యమైన ఛార్జీలు వసూలు చేయాలని లేదంటే బంద్ తప్పదని హెచ్చరిస్తున్నారు.అయితే ఈ బంధ్ నేపథ్యంలో డీఎస్పీ నిర్వాహకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారని సమాచారం. కొన్ని థియేటర్ యజమానులతో మాట్లాడుకొని బంద్ సమయంలో సినిమాలు విడుదలయ్యేలా చేసుకున్నారు.