దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తొలి షో నుంచే సినిమాకు విశేష ప్రేక్షకాదరణ లభించడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు అన్ని వైపుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ సినిమాలో వైఎస్గా మళయాళ మెగాస్టార్ మమ్మూట్టి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మహి వి రాఘవ దర్శకత్వం వహించారు.
సినిమా సూపర్ హిట్ కావడంతో చిత్ర దర్శకుడు శనివారం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. దర్శకుడు మహి వి రాఘవతో పాటు చిత్ర నిర్మాత విజయ్ కూడా జగన్ను కలవడం జరిగింది. సినిమా బాగా తీశారని చిత్ర దర్శకుడిని మెచ్చుకున్నారు జగన్. మీ నాయకుడు సినిమాను మీరే తీసి మీరే ప్రజలలోకి తీసుకువెళ్లారని జగన్ ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఈ సినిమాతో వైఎస్ఆర్ మీద ప్రజలలో ఎంతటి అభిమానం ఉందో తెలిసిందని దర్శకుడు రాఘవ మీడియాతో చెప్పారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రాజన్నను గుర్తుకు తెచ్చుకుని నాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయామని చాలామంది ఆయనకు ఫోన్ చేసి చెబుతున్నారట. చిత్రంపై వస్తున్న ప్రేక్షకాదరణ పట్ల సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు దర్శకుడు. జనాలు ఫోన్ చేసి చిత్రంపై ఫీడ్బ్యాక్ ఇస్తుంటే తనకు మాటలు రావడం లేదని ఆనందం వ్యక్తం చేశారు.