డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసానికి పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. రూ.1.07 కోట్ల డిజిటల్ అరెస్ట్ మోసానికి సంబంధించి న్యూఢిల్లీకి చెందిన 42 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన నిందితుడిని గుర్దీప్ సింగ్ అలియాస్ లక్కీ నారంగ్గా గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం, అక్టోబర్ 16న 62 ఏళ్ల ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. తనకు ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారినని చెప్పుకుంటూ ఓ అన్య వ్యక్తి ఫోన్ చేసి, తన ఫోన్ నంబర్, ఆధార్ కార్డు అక్రమ కార్యకలాపాల్లో ఉపయోగించబడుతున్నాయని, మరో నిందితుడితో లింక్ ఉందని బెదిరించినట్లు బాధితుడు తెలిపాడు.తరువాత అతడిని మరో వ్యక్తితో కలిపి, తనను ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా పరిచయం చేసుకున్నారు. మనీలాండరింగ్ కేసు పేరుతో అరెస్ట్ చేస్తామని, కెరీర్ నాశనం అవుతుందని భయపెట్టి, రూ.1.07 కోట్లను జమ చేయించారు.
లక్కీ నారంగ్ మనీ ఎక్స్ఛేంజ్, ట్రావెల్ వ్యాపారం నిర్వహిస్తూ, ప్రశాంత్ కుమార్, దీపక్ కుమార్తో పాటు మరికొందరితో కలిసి గ్యాంగ్గా ఏర్పడి, కరెంట్ బ్యాంక్ అకౌంట్లు, బ్యాంకింగ్ వివరాలు సేకరించి సైబర్ మోసాలకు ఉపయోగించేవాడు. బ్యాంక్ ఖాతాదారులను కమిషన్ ఆశ చూపి ఢిల్లీ, జైపూర్ వంటి నగరాల హోటళ్లకు పిలిపించి, వసతి కల్పిస్తూ మోసాల కోసం ఖాతాలు ఉపయోగించేవారని పోలీసులు తెలిపారు. బాధితుల నుంచి వచ్చిన డబ్బును వెంటనే సైబర్ మోసం సూత్రధారులకు బదిలీ చేసేవారు.
ఈ కేసులో ఖాతాదారు దీపక్ గహ్లావత్, అకౌంట్ సరఫరాదారు ప్రశాంత్ కుమార్లను ఇప్పటికే అరెస్ట్ చేసి న్యాయహిరాసత్కు తరలించారు.
