డీకే ఆదికేశవులు..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా రాజకీయాలను శాసించారు. ఆర్ధికంగా బలమైన వ్యక్తి. పారిశ్రామిక వేత్తగా, చిత్తూరు ఎంపీగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు డీకే. ఇక 2004లో టీడీపీ ఛైర్మన్గా పనిచేశారు. సత్యసాయి ట్రస్ట్ కోశాధికారిగా పనిచేశారు. జేఎంఎం స్కాం సమయంలో అధికారం కోసం ఓటు హక్కును అనుకూలంగా వినియోగించుకున్న డీకే విజయ మాల్యాకు వ్యాపార భాగస్వామి.
అయితే డీకే ఆదికేశవులు మరణంతో రాజకీయంగా ఆ కుటుంబం కూడా యాక్టివ్ పాలిటిక్స్కు దూరమైంది. అయితే డీకే కొడుకు శ్రీనివాస్ 2009లో ప్రజారాజ్యం నుండి పోటీ చేసి ఓడిపోగా 2014లో డీకే భార్య సత్యప్రభ 2014లో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో ఓటమి పాలుకావడంతో పూర్తిగా ఆ కుటుంబం రాజకీయాలకు దూరమైంది.
తాజాగా ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారు డీకే ఆదికేశవులు కొడుకు శ్రీనివాస్. ఇప్పటికే వైసీపీ అధిష్టానంతో టచ్లో ఉన్నారు. కొద్దికాలం క్రితం సీఎం జగన్తో భేటీ కూడా అయ్యారు. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలో జరిగే ఎన్నికల్లో డీకే పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే అది ఏ పార్టీ నుండి అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకంటే టీడీపీ నేతలు సైతం డీకే కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో శ్రీనివాస్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా డీకే ఫ్యామిలీ రీ ఎంట్రీ చిత్తూరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
