తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఇక బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుండగా ఎగ్జిల్ పోల్స్ కాంగ్రెస్దే గెలుపు అని వెల్లడించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.
గెలిచిన అభ్యర్థులు చేజారిపోకుండా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ని రంగంలోకి దించింది. ఇవాళ హైదరాబాద్కు రానున్న డీకే..రెండు రోజుల పాటు హైదరాబాద్లోనే ఉండి పార్టీ బాధ్యతలను చూసుకోనున్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఫలితాలు దగ్గర దగ్గరగా వస్తే ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుకు పాల్పడకుండా బెంగుళూరు శివారులోని క్యాంపునకు తరలించేలా డీకే ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ప్రత్యేక విమానాల్లో, లేదంటే ప్రత్యేక బస్సుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరు తరలించనున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే గెలిచే ఛాన్స్ ఉన్న అభ్యర్థుల వెంట పరిశీలకులను పంపించారు. గెలిచిన వెంటనే వారిని క్యాంపుకు తరలించే బాధ్యత పరిశీలకులది. అయితే బీజేపీ మాత్రం హంగ్ వస్తే తామే కీలకమవుతామని భావిస్తోండగా ఈ నేపథ్యంలో ఫలితాలు ఎలా వస్తాయి ? ఏ పార్టీకి మోజార్టీ వస్తుంది ? అనేది మాత్రం తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.