పవన్ కళ్యాణ్ చేసిన ‘నర దిష్టి’ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి… పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్పుతున్నా… పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలి. క్షమాపణలు చెబితే ఆయన సినిమాలు ఒకటి రెండు రోజులు అయినా ఆడతాయి. లేదంటే తెలంగాణలో సినిమాలు ఆడనివ్వం అని స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని, తెలంగాణ ప్రజలను అవమానించే వ్యాఖ్యలు చేస్తే చూడకుండా ఉండబోమని హెచ్చరించారు. తెలంగాణ గౌరవం విషయంలో ప్రభుత్వం రాజీపడదని ఆయన హితవు పలికారు.
అదే విధంగా మంత్రి వాకిటి శ్రీహరి కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఘాటు వ్యాఖ్యలే చేశారు. “తెలంగాణ అభివృద్ధి చూసి పవన్ కళ్యాణ్ ఓర్వలేకపోతున్నాడు. అందుకే రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నాడు” అని ఆరోపించారు. రాజకీయ మైలేజ్ కోసమే పవన్ కళ్యాణ్ ఇలాంటి అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది బాధ్యతా రాహిత్యానికి ఉదాహరణ అని తెలిపారు.
పవన్ కళ్యాణ్కు ఇంకా రాజకీయాల్లో పరిపక్వత అవసరమని శ్రీహరి వ్యాఖ్యానించారు. వ్యక్తిగత ప్రచారం కోసం తెలంగాణ గౌరవాన్ని దెబ్బతీయడం అస్సలు తగదు. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ మంత్రుల ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. పవన్ కళ్యాణ్ వర్గం ఇంకా అధికారికంగా స్పందించకపోయినా, మంత్రుల హెచ్చరికలు సినీ వర్గాలు మరియు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎలా మలుపు తిరుగుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.
