ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రిలీఫ్ దక్కలేదు. కవిత బెయిల్ పిటిషన్ని తిరస్కరించింది ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు. ప్రస్తుతం తీహార్ జైలులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు కవిత.
తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఈనెల 16వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోర్టును కోరగా దీనిని తిరస్కరించింది న్యాయస్థానం. కవితకు బెయిల్ ఇస్తే లిక్కర్ కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని ఈడీ అధికారులు న్యాయస్థానానికి తెలిపారు.అందుకే కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టేయాలని ఈడీ కోరగా దీనితో ఏకీభవించింది న్యాయస్థానం.
ఇక మధ్యంతర బెయిల్ని తిరస్కరించడంతో తీహార్ జైలలోనే మరికొన్ని రోజులు ఉండనున్నారు కవిత. ఇక కవిత దాఖలు చేసిన సాధారణ బెయిల్ పిటీషన్ పై సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 20న విచారణ జరపనుంది. కవిత జ్యుడీషియల్ కస్టడీ రేపటితో ముగియనుండగా రేపు ఆమెను కోర్టులో హాజరుపర్చనున్నారు ఈడీ అధికారులు. అనంతరం కస్టడీని మరికొద్దిరోజులు పొడగించే అవకాశం ఉంది.