తెలంగాణ కాంగ్రెస్కు బిగ్ షాక్ తగిలింది. కొంతకాలంగా బీసీలకు పార్టీలో అన్యాయం జరుగుతుందని చెబుతున్న మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్కు రాజీనామా చేశారు. 40 సంవత్సరాలుగా పార్టీకి సేవలందించారు పొన్నాల. కాంగ్రెస్లో ఏకైక బీసీ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు.
రెండేళ్లుగా తనకు పార్టీలో అవమానం జరుగుతోందని…సర్వేల పేరుతో బీసీలను అణచివేసే కుట్ర జరిగిందన్నారు. సీనియర్ నాయకుడినైన తనకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు.టికెట్ల కేటాయింపులో బీసీలకు పార్టీ అన్యాయం చేస్తోందని చెప్పుకొచ్చారు. తీవ్ర మనస్తాపంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.
జనగామ నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు పొన్నాల. వైఎస్ హయాంలో నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి పీసీసీ చీఫ్గా పనిచేశారు. రేవంత్ రెడ్డి తీరుపై కొంతకాలంగా ఆగ్రహంతో ఉన్నారు. ఆయన ఒంటెద్దు పోకడలను భరించలేకపోయారు. ఈ నేపథ్యంలోనే పార్టీకి రాజీనామా చేయగా పొన్నాల రాజీనామా కాంగ్రెస్కు నిజంగా బిగ్ షాక్.
ఇక ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. తెలంగాణలో బీసీ ఓటర్ల సంఖ్య ఎక్కువ. బీసీలకు బీఆర్ఎస్ ప్రాధాన్యం ఇస్తుండటంతో పొన్నాల చేరిన ఆ పార్టీకి మరింత బలంగా మారే అవకాశం ఉంది.