తెలంగాణ ఎన్నికల వేళ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ రెండు అసెంబ్లీ స్థానాల నుండి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. గజ్వేల్ ,కామారెడ్డి రెండు స్థానాల్లో సీఎం కేసీఆర్ పోటీలో ఉండగా ఈ నెల 9న రెండు చోట్ల నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక సీఎం కేసీఆర్పై బీజేపీ నుండి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుండి రేవంత్ రెడ్డి బరిలోకి దిగుతుండగా వేర్వేరు స్థానాల్లో వీరు పోటీ చేస్తున్నారు.
గజ్వేల్లో పోటీ కేసీఆర్ వర్సెస్ ఈటల కాగా కామారెడ్డిలో కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా పోరు మారిపోయింది. ఇక ఈటల, రేవంత్ ఇద్దరూ రెండు స్థానాల్లో పోటీ చేస్తుండటం విశేషం. ఈటల తన సిట్టింగ్ స్థానం హుజురాబాద్తో పాటు గజ్వేల్ నుండి పోటీ చేస్తుండగా రేవంత్ రెడ్డి..కొడంగల్తో పాటు కామారెడ్డిలో బరిలో ఉన్నారు. ఇక ఈ నెల 12న కామారెడ్డిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభను నిర్వహించనుండగా అదే రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు రేవంత్. ఈ సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగసభకు కర్ణాటక సీఎం సిద్దరామయ్య హాజరుకానున్నారు.
ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ చర్చ నడుస్తోంది. సీఎం కేసీఆర్పై ఈటల, రేవంత్ వంటి సీనియర్లు పోటీ చేస్తుండటంతో ఎవరిది పై చేయి అవుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరిలో ఎవరు గెలిచినా వారు హీరోగా మిగలనుండగా ఓడిపోతే మాత్రం రాజకీయంగా ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది.మొత్తంగా సీఎం కేసీఆర్పై పోటీ చేస్తామని చెప్పినట్లుగానే ఈటల, రేవంత్ రెడ్డి బరిలోకి దిగుతుండటం విశేషం.