కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అనంత వెంకటరామిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హామీలు ఇవ్వడం, తర్వాత వాటిని విస్మరించడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అలవాటేనని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన “సూపర్ సిక్స్” హామీలు ఏమయ్యాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.1500 ఆర్థిక సాయం వంటి వాగ్దానాలపై ఇప్పటివరకు స్పష్టత లేదని విమర్శించారు.
అంగన్వాడీ కార్యకర్తలపై జరిగిన పోలీసుల లాఠీచార్జ్ను ఆయన తీవ్రంగా ఖండించారు. అర్ధరాత్రి శిబిరాల్లోకి దూరి మహిళలపై దాడులు చేయడం దారుణమని, మహిళల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని అన్నారు.
రాష్ట్రంలో “దోచుకో.. దాచుకో.. పంచుకో” పాలన నడుస్తోందని ఆరోపించిన వెంకటరామిరెడ్డి, కమీషన్ల భారంతో పరిశ్రమలు రాష్ట్రాన్ని విడిచిపోతున్నాయని అన్నారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో భూములు కేటాయించినా కంపెనీలు వెనక్కి వెళ్లిపోతున్నాయని తెలిపారు.
అమరావతిని రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చేశారని, రాజధాని పేరుతో రూ.47 వేల కోట్ల అప్పు తీసుకున్నారని విమర్శించారు. 1.75 లక్షల ఎకరాల్లో రాజధాని విస్తరణకు ఎన్ని ఏళ్లు పడుతుంది? ఎంత ఖర్చవుతుంది? అని ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
