నూతన పార్లమెంట్ భవనంలో ఇవాళ చారిత్రాక మహిళా బిల్లును ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. కొత్త పార్లమెంట్ భవనం తొలిరోజే ఇంతటి మహాత్కార్యాన్ని చేపట్టడం గర్వంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెప్పుకొచ్చారు. అంతేగాదు ఇందుకోసమే దేవుడు తనను ఇక్కడికి పంపించాడని తెలిపారు. ఇక ఇవాళ పార్లమెంట్లో చట్టసభల్లో అంటే పార్లమెంట్, రాజ్యసభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో 33 శాతం రిజర్వేషన్ బిల్లుకు మోక్షం లభించనుండగా నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా నేతల్లో ఆ పార్టీలోని అసంతృప్తులు, ఇతర పార్టీల నుండి వచ్చినవారికి టికెట్ ఇవ్వడంతో మనస్తాపానికి గురయ్యేవారు. కానీ ఇప్పుడు ఈ చట్టం అమల్లోకి వస్తే…ఆ నేతల సీట్లకు ఎసరు పడే అవకాశం పక్కా. అయితే నాయకులకు కాస్త రిలీఫ్ ఏంటంటే ఇది అమల్లోకి రావడానికి సమయం పడుతుంది. డీలిమిటేషన్ ప్రకారమే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని బిల్లులో కేంద్రం చెప్పిన నేపథ్యంలో ఈ ఎన్నికలే కొంతమంది నేతలకు చివరి ఎన్నికలు కావొచ్చు. ఎందుకంటే డీలిమిటేషన్ ప్రకారం ఆయా పార్లమెంట్, అసెంబ్లీ స్ధానాల్లో మార్పులు ఖాయం. జనరల్ ఉన్న స్ధానం బీసీ మహిళా కావొచ్చు లేదా జనరల్ మహిళ కావొచ్చు. దీంతో నేతలు పోటీ చేసే అవకాశం కొల్పోతారు. అయితే వారి సతీమణులను రంగంలోకి దించే ఛాన్స్ కూడా లేకపోలేదు.
ఇక ఈ బిల్లులో సార్వత్రిక ఎన్నికలు జరిగిన ప్రతిసారి రిజర్వ్డ్ స్థానాల్లో మార్పులు చేయాలని మంత్రివర్గం ప్రతిపాదించింది. అంతేకాదు, 33 శాతం కోటాలో ఎస్సీ, ఎస్టీలు, ఆంగ్లో-ఇండియన్లకు సబ్-రిజర్వేషన్లను కూడా ప్రతిపాదించారు. ఇక ఈ చట్టం 2029 ఎన్నికల నుంచే అమలుకానుంది. నియోజకవర్గాల పునఃవ్యవస్థీకరణ తర్వాత ఇది అమల్లోకి వస్తుందని బిల్లులో పేర్కొన్నారు. ఇప్పుడు ఆమోదం పొందినా 2029లోపు అమలు సాధ్యం కాదు. ఎందుకంటే నియోజకవర్గాల విభజన, చట్టం అమలులోకి వచ్చిన తర్వాత మొదటి జనగణన అనంతరం మాత్రమే సాధ్యమవుతుంది. జనగణన 2027లో జరిగే అవకాశం ఉంది. మహిళా కోటా బిల్లు మాత్రం కేవలం 15 ఏళ్లే అమల్లో ఉంటుందని స్పష్టంగా అందులో పేర్కొనడం గమనార్హం. సో కొంతమంది నేతలకు ఇవే చివరి ఎన్నికలు అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
