మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రాల్లో ఒకటైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విడుదలకు ముందే అభిమానుల్లో అపారమైన ఉత్సాహం నెలకొంది. ఈ ఉత్సాహానికి నిదర్శనంగా పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో నిర్వహించిన బెనిఫిట్ షో టికెట్ వేలం నిలిచింది. ఈ వేలంలో సినిమా మొదటి బెనిఫిట్ షో టికెట్ను లక్షా రెండు వేల రూపాయలకు చిరంజీవి అభిమాని చాగంటి గణేశ్ సొంతం చేసుకున్నారు. మెగాస్టార్ పై ఉన్న అభిమానం, అభిమానుల అంకితభావానికి ఇది మరో ఉదాహరణగా నిలిచింది.
ఈ సందర్భంగా నర్సాపురంలో మెగా అభిమానుల మధ్య సంబరాలు అంబరాన్ని తాకాయి. టికెట్ వేలం అనంతరం ప్రత్యేకంగా కేక్ కట్ కార్యక్రమం నిర్వహించి, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీ కృష్ణ పాల్గొన్నారు. వారు చిరంజీవి సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు.
చిరంజీవి సినిమాలు విడుదలయ్యే సమయంలో ఇలాంటి వేడుకలు, టికెట్ వేలాలు జరగడం కొత్తేమీ కాదు. అయినా ప్రతి సారి అభిమానుల ఉత్సాహం మరింత పెరుగుతూనే ఉంటుంది. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బెనిఫిట్ షో టికెట్కు ఇంత భారీ ధర పలకడం, సినిమా విడుదలకు ముందే సూపర్ హిట్ టాక్ను సూచిస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనతో నర్సాపురం మరోసారి మెగా అభిమానుల కేరాఫ్ అడ్రస్గా నిలిచింది.
