తెలంగాణ టీడీపీలో జంపింగ్ జపాంగ్ ల వ్యవహారం ఇప్పట్లో చల్లారేలా లేదు. ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ మారే వ్యవహారం వెనక.. 60 కోట్ల రూపాయల టీడీపీ సొమ్ము వ్యవహారమే కారణమన్న వాదన వినిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికలకు ఉపయోగించాలంటూ..
పార్టీ అంత మొత్తం కేటాయించిందనీ.. ఆ డబ్బును రేవంత్ రెడ్డికి అందించి లెక్కలు కూడా తనే చెప్పాలని బాధ్యత అప్పగించిందన్న రూమర్ వినిపిస్తోంది.
ఈ విషయంలో అలకతోనే.. ఎర్రబెల్లి అదును చూసుకుని మరీ సైకిల్ దిగి కారెక్కినట్టు తెలుస్తోంది. అయితే.. టీడీపీలో కొందరు నేతలు చేస్తున్న వాదన ప్రకారం.. పార్టీ ముఖ్య బాధ్యతల్లో ఉన్న మరో నాయకుడు కూడా బాబు తీరుపై ఆగ్రహంతో ఉన్నారట. రేవంత్ రెడ్డికి డబ్బుల బాధ్యతలు అప్పజెప్పి.. తనకు మాట మాత్రం కూడా సమాచారం ఇవ్వకపోవడమే ఆయన్ను తీవ్ర అసంతృప్తికి గురి చేసినట్టు తెలుస్తోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు కూడా ఎటూ వెళ్లకుండా.. బీసీ నాయకుడిగా.. బాబుకు కొండత అండగా ఉన్న తనకు.. ఇలాంటి అవమానమా అని ఆయన లోలోపలే మథనపడుతున్నారట.
మరోవైపు రేవంత్ రెడ్డి కోటరీ కూడా.. ఈ విషయంలో సైలెన్స్ మెయింటైన్ చేయడం.. తెలంగాణ టీడీపీ అంతా తమ సొత్తే అన్నట్టు వ్యవహరిస్తుండడం ఆ నాయకుడిని ఆగ్రహానికి గురి చేస్తోందట. ఇవన్నీ గమనిస్తుంటే.. పార్టీకి సారథిగా ఉన్న ఆయన కూడా రేపో మాపో సైకిల్ దిగడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. అయితే.. టీఆర్ఎస్ అంటే గిట్టని ఆ నాయకుడు.. అవసరమైతే బీజేపీలోకి వెళ్తారన్న గుసగుసలు మొదలయ్యాయి. ఈ విషయంపై.. బాబు అండ్ కో ఎలా స్పందిస్తారో మరి!