ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. ముఖ్యంగా అధిక జనాభా ఉన్న భారత దేశంలో కరోనా మొదటి దశ కంటే రెండో దశ ప్రజలపై తీవ్రం ప్రభావం చూపిస్తోంది. కరోనా ఉధృతికి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో ఈ ప్రభావం సినీ పరిశ్రమ పై కూడా భారీగానే పడింది.
కరోనా నిబంధనల కారణంగా సినిమా థియేటర్స్ మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న టక్ జగదీష్, లవ్స్టోరి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్, ఖిలాడి, రిపబ్లిక్, మేజర్ ఇలా విడుదలకి ముస్తాబైన సినిమాలు చాలానే ఉన్నాయి. అలాగే షూటింగ్ మధ్యలో నిలిచిన ఆచార్య , ఆర్.ఆర్.ఆర్ , అఖండ , రాధేశ్యామ్ ,కె.జి.ఎఫ్ ఛాప్టర్ 2 , పుష్ప వంటి సినిమాలు కూడా రిలీజ్ డేట్స్ ను ప్రకటించే సాహసం చేయలేకపోతున్నాయి. కరోనా నిబంధనలు తొలగి థియేటర్స్ ప్రారంభమైతే తప్ప వీటి విడుదల తేదీలను ప్రకటించే అవకాశం లేదు.
Also read:ఈ ఫొటోలో ఉన్న పాప ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..?
తాజాగా వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలో దిగడానికి సిద్ధమవుతున్న సినిమాలు మహేష్బాబు కథానాయకుడిగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’, పవన్కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ఈ రెండు సినిమాలు మాత్రమే సంక్రాంతి లక్ష్యంగా షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభించాయి. ఇప్పుడు అనుకున్న సమయానికి సినిమాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేని పరిస్థితి నెలకొన్న సందర్భంలో ఈ రెండు మూవీలు సంక్రాంతి బరిలో సందడి చేయగలవా అన్న సందేహం అటు ఇండస్ట్రీలోనూ, ఇటు సినీ ప్రేక్షకుల్లోనూ చర్చ సాగుతోంది.